ఆకర్షణలకు లొంగొద్దు: తీగలతో చంద్రబాబు
హైదరాబాద్: తెలంగాణలో అధికార పార్టీ చూపెడుతున్న ఆకర్షణలకు లొంగొద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆ పార్టీ నేతలకు సూచించారు. ఇప్పటికే పలువురు తెలంగాణలోని టిడిపి నేతలు అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన విషయం తెలిసిందే. మరికొందరు కూడా ఆ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మంగళవారం చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఒక్కసారి వ్యక్తిత్వాన్ని కోల్పోతే కోట్లు వెచ్చించినా తిరిగి పొందలేమని స్పష్టం చేశారు. తీగల కృష్ణారెడ్డి టిఆర్ఎస్లో చేరుతున్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయనను పిలిపించి చంద్రబాబు మాట్లాడినట్లు తెలుస్తోంది.
అధికారంలో ఉన్న పార్టీలు ప్రతిపక్షనేతలను ఆకర్షించేందుకు అనేక విధాలుగా ప్రయత్నిస్తాయని, వాటికి లొంగవద్దని అన్నారు. ‘నాకంటే ముందు నుంచి పార్టీలో పని చేస్తున్నారు. మీ మీద నాకు పూర్తి విశ్వాసం ఉంది. మీకు అన్ని విధాలుగా అండగా ఉంటా' అని తీగల కృష్ణారెడ్డితో చంద్రబాబు అన్నారు.
ఇది ఇలా ఉండగా ముఖ్య నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకునేందుకు తీగల నిర్వహించిన సమావేశంలో సుమారు 300మంది పాల్గొన్నారు. తెలుగుదేశం నుంచి గెలిచి ఇప్పటికిప్పుడే పార్టీ మారితే బాగుండదని పలువురు ఈ భేటీలో తీగలకు సూచించినట్లు సమాచారం.