రేషన్ కార్డు దరఖాస్తుల పరిశీలనకు యాప్ - అవి ఉంటేనే కొత్త కార్డు జారీ..!
రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. అర్హులైనవారికి రేషన్ కార్డులను మంజూరు చేయాలని కసరత్తులు చేస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 90 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులున్నాయి. కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారు లక్షల సంఖ్యలో ఉన్నారు. వారిలోనూ అర్హులైన వారికి రేషన్కార్డులు మంజూరు చేయాలి.

ఆయా జిల్లాల పరిశీలన ప్రక్రియ కూడా పూర్తయినట్లు సమాచారం. ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో మార్చి 1 నుంచి మిగతా జిల్లాల్లో మార్చి 8 తర్వాత కొత్త రేషన్కార్డులు ఇవ్వాలని రేవంత్ సర్కార్ ఇప్పటికే నిర్ణయించింది. స్మార్ట్ కార్డు రూపంలో రేషన్కార్డులు ఇవ్వనున్న నేపథ్యంలో జారీ ప్రక్రియ ఆలస్యం కానున్నట్లు తెలిసింది. కొత్త వారితో పాటు ఇప్పటికే రేషన్ కార్డు ఉన్నవారికి సైతం స్మార్ట్ రేషన్కార్డులు జారీ చేయనున్నట్లు సమాచారం. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ టెండర్లు పిలిచింది.
ఆర్ఐ నుంచి తహసీల్దార్కు..
మొబైల్ యాప్లో దరఖాస్తుల విచారణ అనంతరం ఆర్ఐ నుంచి తహసీల్దార్కు, అక్కడి నుంచి డీఎస్వో లాగిన్కు రేషన్ కార్డు దరఖాస్తుదారుల వివరాలు వెళ్తాయి. మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీసర్ లాగిన్ నుంచి మున్సిపల్ కమిషనర్కు, అక్కడి నుంచి డీఎస్వో లాగిన్కు వస్తాయి. వీటన్నింటినీ డీఎస్వో పౌర సరఫరాల శాఖ కమిషనర్ లాగిన్కు ఆన్లైన్లో సమర్పిస్తారు. కార్డుల మంజూరు వివరాలు పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్థాయిలో వెల్లడి కానున్నాయి.
రేషన్ కార్డుల కోసం చేసిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని గతంలోనే ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు ప్రత్యేక మొబైల్ యాప్ను సైతం రూపొందించారు. దరఖాస్తులను పరిశీలించిన అనంతరం వివరాలను ఆన్లైన్లో వీలైనంత త్వరగా అప్డేట్ చేయనున్నారు.
ప్రజా పాలన గ్రామ సభల్లో ఫిబ్రవరి 18 నాటికి రాష్ట్రవ్యాప్తంగా కొన్ని లక్షల సంఖ్యలో దరఖాస్తులు అందాయి. ఈ వివరాలన్నింటినీ ఆన్లైన్లో నమోదు చేశారు. ఆయా దరఖాస్తుల పరిశీలన బాధ్యతను మున్సిపాలిటీల్లో వార్డు అధికారులకు అప్పగించనున్నారు. మండలాల్లో అయితే రెవెన్యూ ఇన్స్పెక్టర్లు (ఆర్ఐ) చేయనున్నారు. ఎంపిక చేసిన ఆర్ఐలు, వార్డు అధికారులు తమ మొబైల్ ఫోన్లో ప్రభుత్వం రూపొందించిన యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇళ్లకు వెళ్లి విచారణ
వారికి లాగిన్ ఐడీ, పాస్వర్డ్లను సంబంధిత అధికారులు కేటాయించనున్నారు. దరఖాస్తులు యాప్లో లభ్యమవుతాయి. వాటి ఆధారంగా దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి విచారణ చేయనున్నారు. ఇందుకు కచ్చితమైన మార్గదర్శకాలను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు ఊహించిన దాని కంటే ఎక్కువగానే వచ్చినట్లు అధికారులు చెప్పారు.












Click it and Unblock the Notifications