కరోనా పేరుతో దోపిడీ-మరో 6 ఆస్పత్రుల లైసెన్సులు రద్దు-తెలంగాణ వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు
కరోనా చికిత్స విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు అడ్డగోలు దోపిడీకి పాల్పడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ప్రైవేట్ ఆస్పత్రులపై తెలంగాణ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ 10 ఆస్పత్రుల లైసెన్సులు రద్దు చేసిన ప్రభుత్వం... తాజాగా మరో ఆరు ఆస్పత్రులపై వేటు వేసింది. ఆయా ఆస్పత్రులకు కోవిడ్ చికిత్స లైసెన్సులను రద్దు చేసింది. వేటు పడిన ఆస్పత్రుల్లో పద్మజ హాస్పిటల్-కేపీహెచ్బీ,హైదరాబాద్,లైఫ్ లైన్ మెడిక్యుర్ హాస్పిటల్-అల్వాల్,మ్యాక్స్ కేర్ హాస్పిటల్-హన్మకొండ,టీఎక్స్ హాస్పిటల్-ఉప్పల్,లలిత హాస్పిటల్-వరంగల్,శ్రీ సాయిరాం హాస్పిటల్-సంగారెడ్డి ఉన్నాయి.
ప్రస్తుతం చికిత్స పొందుతున్న రోగులందరికీ వైద్యం కొనసాగించాలని.. కొత్త కరోనా రోగులను చేర్చుకోవద్దని ఆ ఆరు ఆస్పత్రులకు వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకూ 16 ఆస్పత్రుల కోవిడ్ ట్రీట్మెంట్ లైసెన్సులు రద్దయ్యాయి. ఇప్పటివరకూ 105 ఆస్పత్రులపై 166 ఫిర్యాదులు అందినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. షోకాజ్ నోటీసులకు 24 గంటల్లో సరైన వివరణ ఇవ్వలేని పక్షంలో ఆస్పత్రుల లైసెన్సులు రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది.
బంజారాహిల్స్ విరించి ఆస్పత్రిలో కరోనా రోగి బంధువులు గొడవకు దిగడంతో ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.వంశీ కృష్ణ అనే పేషెంట్ చనిపోవడంతో అతని కుటుంబ సభ్యులు ఆస్పత్రి యాజమాన్యంతో గొడవకు దిగారు. కోవిడ్ చికిత్సలో ప్రోటోకాల్ పాటించలేదని... పైగా రూ.20లక్షలు బిల్లు వేశారని ఆరోపించారు.కేవలం జ్వరంతో ఆస్పత్రిలో చేరిన తన సోదరుడికి స్టెరాయిడ్స్ ఎందుకు ఇచ్చారని మృతుడి సోదరి వైద్యులను నిలదీశారు.ఒక దశలో ఆస్పత్రిపై మృతుడి బంధువుల దాడికి దిగారు. ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం చేశారు. ఈ ఘటనతో తెలంగాణ ప్రభుత్వం ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలకు ఉపక్రమించింది. 64 ఆస్పత్రులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీకి బలవుతున్న ఎంతోమంది ప్రభుత్వానికి ఫిర్యాదులు చేస్తున్నారు.