నేను పెరిగింది తెలంగాణలో, పుట్టింది ఏపీలో, తెలుగును తల్లిగా భావిస్తా: వెంకయ్య
హైదరాబాద్: తెలుగువారంతా ఒకటేనని నేను నమ్ముతాను. నేను పెరిగిన తెలంగాణలో నేను పుట్టిన ఏపీలో అడుగు పెట్టకుంటే నాకు ఎంతో వెలితిగా ఉంటుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పారు.
ప్రపంచ తెలుగు మహాసభలు హైదరాబాద్ ఎల్బీ మైదానంలో శుక్రవారం నాడు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు.మహసభల ప్రారంభసూచికంగా టపాకాయలు కాల్చారు.
తెలంగాణ రాష్ట్రంలోని హైద్రాబాద్ వేదికగా ప్రపంచ తెలుగు మహసభలను నిర్వహించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. అంగరంగ వైభవంగా ప్రపంచ తెలుగు మహసభలను ప్రారంభమయ్యాయి.
తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్రావు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

తెలుగునే అమ్మగా భావిస్తా
నేను పెరిగిన తెలంగాణలో, నేను పుట్టిన ఆంధ్రలో అడుగుపెట్టకపోతే తెలుగు నేలను తాకకపోతే నాకు ఏదో కోల్పోయినట్లు ఉంటుందని నేను నిర్మొహమాటంగా, నిస్సంకోచంగా చెబుతున్నా' అని వెంకయ్య నాయుడు అన్నారు. గూగుల్ గురువుకు ప్రత్యామ్నాయం కాదని వెంకయ్యనాయుడు చెప్పారు.తరగతి గది... తరగని నిధి. గూగుల్ గురువుకు ప్రత్యామ్నాయం కాదు. సీఎం కేసీఆర్కు తెలుగు భాష అంటే మక్కువ, ఎక్కువ. కేసీఆర్ ప్రసంగం చెప్పలేనంత సంతోషం కలిగించింది. చక్కటి మాటలతో కేసీఆర్ విందు భోజనం ముందే పెట్టేశారు. భాష మాత్రమే కాదు.. యాసను కూడా మర్చిపోవద్దు. యాస మన ప్రాణాన్ని గుర్తు చేస్తుంది అని వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు.40 ఏళ్లు ఇక్కడే (హైదరాబాద్)లో పెరిగాను.. ఏపీలో పుట్టి 25 ఏళ్లు అక్కడే చదివాను. చిన్నప్పుడే తల్లిని కోల్పోయాను. అందుకే తెలుగును తెలుగు నేలను తల్లిగా భావిస్తానని వెంకయ్యనాయుడు చెప్పారు.

ఇంగ్లీష్ వస్తేనే జీవితంలో ఎదుగుతామనేది పొరపాటు
బావ మరదలు అంటేనే సంతోషం. అంతేగానీ బ్రదర్ ఇన్లా సిస్టర్ ఇన్లా అంటే ఏం బావుంటుంది. అమ్మ భాష కళ్లలాంటివి.. పరాయి భాష కళ్లద్దాల్లాంటివి.. అమ్మభాషలేకుంటే కళ్లద్దాలు కూడా పనికి రావు. తన భాష తనకు తెలుసు ప్రజల భాష తెలుసు కాబట్టే కేసీఆర్ పరిపాలకుడయ్యారు. ఆంగ్లం చదివితేనే పై స్థాయికి వెళతారనుకోవడం తప్పు. ఇతర రాష్ట్రాల్లో తెలుగు వారికి తెలుగు స్కూళ్లు పెట్టించే ప్రయత్నం చేయిస్తున్నాం. మాతృభాషను మర్చిపోతే అస్తిత్వానికి ప్రమాదం.. ప్రజలు, ప్రభుత్వం, పత్రికలు కలిసి పనిచేయాలని వెంకయ్యనాయుడు సూచించారు.

తెలుగు భాషలో నాయకత్వ లక్షణాలు
తెలుగు భాషలో నాయకత్వ లక్షణాలున్నాయని మహరాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్రావు అభిప్రాయపడ్డారు. తెలుగు మహాసభలకు ఆహ్వానించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్రావు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ నడిబొడ్డున తెలుగు మహాసభలు నిర్వహించాలని కలలు కన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.తెలంగాణ ప్రాంత కవులు, కళాకారుల ప్రస్తావన తక్కువగా ఉండేదని చెప్పారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ తెలంగాణ అని దాశరథి కీర్తించారని విద్యాసాగర్ రావు గుర్తుచేశారు.మాతృభాషలోనే విద్యాబోధన ఉండాలని విద్యాసాగర్రావు సూచించారు.

పూతరేకు గురించి తెలుసుకోవడానికి కష్టపడ్డా
తెలంగాణ ధిక్కార స్వరానికి ప్రతీకగా బమ్మెర పోతన నిలిచాడని తెలంగాణ సీఎం కెసిఆర్ చెప్పారు.తనలోని భాష తృష్ణను ఆనాడే అప్పటి తన గురువులు గుర్తించారని ఆయన చెప్పారు. అలాంటి గురువులు తనకు సాన పెట్టారని ఆయన చెప్పారు. రాయిలాంటి తనకు సానపెట్టారని కెసిఆర్ చెప్పారు.తెలుగు సినిమా నటుడు శోభన్బాబు సినిమాలో ఓ సినిమా పాటలో పూత రేకు అనే పదానికి అర్ధం తెలుసుకోవడానికి తాను ఆనాటి తన గురువును అడిగినట్టు చెప్పారు. అయితే తన కోసం ఆనాడు తన స్నేహితుడికి లేఖ రాసి పూతరేకుల అర్ధం తెలుసుకొన్నట్టు చెప్పారు.తనను తన గురువు మృత్యుంజయ శర్మ తనను ఎంతగానో ప్రోత్సహించారని కెసిఆర్ గుర్తు చేసుకొన్నారు. బాషను రక్షించుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రపంచ తెలుగు భాషలను నిర్వహిస్తున్నట్టు చెప్పారు.












Click it and Unblock the Notifications