తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం: లారీ బోల్తా: తుమ్మకర్రల మధ్య చిక్కుకుని నలుగురు దుర్మరణం
మహబూబాబాద్: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలు నలుగురు కూలీలు దుర్మరణం పాలయ్యారు. మరో ఏడుమంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. వారికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. వారంతా రంగారెడ్డి జిల్లా మంచాల మండలానికి చెందినవారిగా గుర్తించారు. మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూర్ మండలం చీకటాయపాలెం సమీపంలో ఈ ఘటన సంభవించింది.
రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆంబోతు తండాకు చెందిన 11 మంది కూలీలు మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలంలో తుమ్మకర్రలను కొనుగోలు చేశారు. ఓ లారీలో వాటిని హైదరాబాద్కు తరలిస్తుండగా.. మార్గమధ్యలో లారీ చీకటాయపాలెం సమీపంలోని చెరువు సమీపంలో ప్రయాణిస్తున్న సమయంలో మలుపులో అదుపు తప్పింది. బోల్తా పడింది. అతివేగమే దీనికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. లారీ బోల్తా పడిన సమయంలో అందులో ప్రయాణిస్తోన్న 11 మంది కూలీలు ఉన్నారు.

వారిలో నలుగురు సంఘటనాస్థలంలోనే దుర్మరణం పాలయ్యారు. మృతులంతా రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆంబోతుతండాకు చెందిన గోవిందు, హరియా, మధు, రాట్ల ధూర్యాగా గుర్తించారు. లారీ క్యాబిన్లో కూర్చున్న ఏడుమంది ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నప్పటికీ తీవ్రంగా గాయపడ్డారు. వారిని మహబూబాబాద్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
తొర్రూర్ మండలంలో తరచూ తుమ్మచెట్లు, తుమ్మకర్రలను అక్రమంగా తరలిస్తుంటారని స్థానిక అధికారులు చెబుతున్నారు. రాత్రివేళ తుమ్మ చెట్లను నరికి వేసి, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ వంటి ప్రాంతాలకు తరలిస్తుంటారని, దీని ద్వారా ఉపాధిని పొందుతారని అంటున్నారు. ఈ ఘటన కూడా అందులో భాగంగానే చోటు చేసుకుని ఉండొచ్చని చెబుతున్నారు. గాయపడ్డ వారిని చికిత్స నిర్వహించిన అనంతరం స్వస్థలాకు పంపిస్తామని అన్నారు.












Click it and Unblock the Notifications