కరోనా విజృంభణకు తెలంగాణలో కళ్లెం..ఎలా సాధ్యం?: 10 వేలకు క్షీణిస్తోన్న యాక్టివ్ కేసులు
హైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ తీవ్రత తెలంగాణ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. రోజువారీ పాజిటివ్ కేసుల్లో తగ్గుదల కొనసాగుతోంది. కొత్త కేసులు వెయ్యికి లోపే నమోదవుతున్నాయి. కరోనా మరణాలు కూడా పరిమితంగా నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య అయిదుకు మించకపోవడం ఊరటనిస్తోంది. వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నప్పటికీ.. కరోనా వైరస్ విజృంభణకు తెలంగాణ ప్రభుత్వం విజయవంతంగా కళ్లెం వేయగలిగింది. యాక్టివ్ కేసుల సంఖ్య 10 వేలకు తగ్గుతున్నాయి. ముందుజాగ్రత్త చర్యలను కఠినంగా పాటించేలా చర్యలను తీసుకోవడం వల్లే ఇది సాధ్యపడిందని అధికారులు అంటున్నారు.
తెలంగాణలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 862 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ముగ్గురు మరణించారు. 961 మంది డిశ్చార్జి అయ్యారు. సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,66,904కు చేరుకోగా.. ఇందులో కోలుకుని, ఇళ్లకు వెళ్లిన వారు 2,54,676 మంది ఉన్నారు. 1,444 మంది మృత్యువాత పడ్డారు. రోజువారీ కొత్త కేసులు తగ్గడం, అదే సమయంలో డిశ్చార్జీలు పెరగడం వల్ల రోగుల సంఖ్యా క్షీణిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా యాక్టివ్గా ఉన్న కేసులు 10 వేలకు క్షీణిస్తున్నాయి. తాజాగా 10,784 యాక్టివ్ కేసులు నమోదు అయ్యాయి.
గృహాలు, ఇన్స్టిట్యూషనల్ ఐసొలేషన్లో 8,507 మంది చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు తెలంగాణ వైద్య మంత్రిత్వ శాఖ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొత్తగా 146 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇదివరకటి రోజువారీ కేసులతో పోల్చుకుంటే ఈ సంఖ్య చాలా తక్కువ. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల కోలాహలం కొనసాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ కొత్త కేసులు పరిమితంగానే నమోదవుతుండటంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగుతుందని ఆశిస్తున్నారు.
జిల్లాలవారీగా ఆదిలాబాద్-4, భద్రాద్రి కొత్తగూడెం-53, జగిత్యాల-24, జనగామ-4, జయశంకర్ భూపాలపల్లి-11, జోగుళాంబ గద్వాల-4, కామారెడ్డి-9, కరీంనగర్-38, ఖమ్మం-63, కొమరంభీమ్ ఆసిఫాబాద్-7, మహబూబ్నగర్-15, మహబూబాబాద్-8, మంచిర్యాల-26, మెదక్-9, మేడ్చల్ మల్కాజ్గిరి-91, ములుగు-11, నాగర్ కర్నూలు-10, నల్లగొండ-35, నారాయణపేట్-8, నిర్మల్-2, నిజామాబాద్-13, పెద్దపల్లి-37, రాజన్న సిరిసిల్ల-10, రంగారెడ్డి-57, సంగారెడ్డి-27, సిద్ధిపేట్-20, సూర్యాపేట్-28, వికారాబాాద్-8, వనపర్తి-11, వరంగల్ రూరల్-12, వరంగల్ అర్బన్-33, యాదాద్రి భువనగిరి-10 కేసులు నమోదు అయ్యాయి.
Recommended Video
తెలంగాణ వ్యాప్తంగా 24 గంటల్లో 41,101 కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించినట్లు అధికారులు తమ తాజా బులెటిన్లో వెల్లడించారు. దీనితో ఇప్పటిదాకా నిర్వహించిన మొత్తం టెస్టింగుల సంఖ్య 52,89,908గా నమోదైంది. సగటున ప్రతి 10 లక్షల మంది జనాభాకు 1,42,125 మంది శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొన్నారు.