కీసరగుట్ట టు కిలిమంజారో: హైదరాబాద్ రెండో తరగతి విద్యార్థి ప్రపంచ రికార్డ్
హైదరాబాద్: మౌంట్ కిలిమంజారో.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన పర్వతశ్రేణుల్లో ఒకటి. ప్రమాదకరమైనది కూడా. నిద్రాణమైన అగ్నిపర్వతం ఇది. ఆఫ్రికాలోని టాంజానియాలో ఉండే ఈ పర్వత శిఖరాగ్రంపై క్షణక్షణానికి వాతావరణం మారుపోతుంటుంది. మంచుతో కప్పి ఉండే ఈ పర్వతం ప్రధాన శిఖరం కిబోను అందుకోవాలంటే 5,885 మీటర్లను అధిగమించాల్సి ఉంటుంది. లక్ష్యాన్ని చేరే క్రమంలో ప్రమాదకరమైన వాతావరణ పరిస్థితులు, బలమైన ఈదురుగాలులను ఎదుర్కొని నిల్చోవాల్సి ఉంటుంది. అలాంటి సంక్లిష్టమైన యాత్రను విజయవంతంగా చేశాడు హైదరాబాద్కు చెందిన ఏడేళ్ల బాలుడు విరాట్ చంద్ర.
తిరుమలగిరిలో నివసించే విరాట్ చంద్ర బేగంపేట్ గీతాంజలి దేవ్శాల స్కూట్లో రెండో తరగతి చదువుతున్నాడు. ఆరు రోజుల్లో 5885 మీటర్ల ఎత్తు ఉన్న మౌంట్ కిలిమంజారో శిఖరాన్ని అధిరోహించి, చరిత్ర సృష్టించాడు. ఏడేళ్ల వయస్సులో ఈ పర్వతాన్ని అధిరోహించిన వారెవరూ ఇప్పటిదాకా లేరు. కిలిమంజారోను అధిరోహించాలని నిర్ణయించుకున్న తరువాత.. బూట్స్ అండ్ క్రాంప్ట్ అనే సంస్థను సంప్రదించారు అతని తల్లిదండ్రులు. ఆ సంస్థ ద్వారా శిక్షణ తీసుకున్నాడు. కోచ్ భరత్ ఆధ్వర్యంలో మౌలాలి, కీసరగుట్టలను అధిరోహించాడు. అనంతరం హైదరాబాద్, బెంగళూరుల్లో ట్రెక్కింగ్లో ట్రైనింగ్ తీసుకున్నాడు.
కిందటి నెల 28వ తేదీన కోచ్ భరత్తో కలిసి కిలిమంజారోకి వెళ్లాడు. ఈ నెల 6వ తేది సాయంత్రం కిలిమంజారోను అధిరోహించాడు. దీనికోసం ఆరు రోజుల సమయం పట్టినట్టు భరత్ తెలిపారు. ఏడేళ్ల వయస్సులో ఆరు రోజుల వ్యవధిలో అత్యున్నత శిఖరాగ్రం కీబూ పీక్ వద్దకు చేరుకోవడం ఇదే తొలిసారి అని చెప్పారు.
ఇదివరకు అనంతపురం జిల్లాకు చెందిన రిత్విక శ్రీ ఈ రికార్డును నెలకొల్పారు. తొమ్మిదేళ్ల వయస్సులో ఆమె కిలిమంజారోను అధిరోహించారు. తాజాగా ఆ రికార్డును విరాట్ చంద్ర తుడిచి పెట్టేశాడు. ఏడేళ్ల వయస్సులోనే ఈ పర్వతాన్ని అధిరోహించాడు.