సాక్షిగానే: వేం కుమారుడిపై గంటల కొద్ది ప్రశ్నలు కరిపించిన ఎసిబి
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత వేం నరేందర్ రెడ్డి కుమారుడు కృష్ణ కీర్తన్ రెడ్డిని తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు ఎనిమిదిన్నర గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారని సమాచారం. అయితే, కృష్ణ కీర్తన్ రెడ్డిని సాక్షిగానే విచారించామని ఎసిబి అధికారులు చెప్పారు.
సీఆర్పీసీ సెక్షన్ 160 ప్రకారం ఏబీసీ అధికారులు కీర్తన్ రెడ్డికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కీర్తన్ రెడ్డి బుధవారం ఉదయం ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఉదయం నుంచి సుదీర్ఘ విచారణలో ఏసీబీ అధికారులు కీర్తన్ రెడ్డిని పలు అంశాలపై ప్రశ్నిస్తున్నారు.
తెలంగాణ నామినేటెడ్ శాసనసభ్యుడు స్టీఫెన్సన్కు ఇవ్వజూపిన రూ. 50 లక్షలు ఎక్కడినుంచి వచ్చాయనే దానిపై అధికారులు కీర్తన్ రెడ్డిని ప్రధానంగా ప్రశ్నించినట్లు తెలుస్తోదంి.. అలాగే ఈ వ్యవహారంలో ఎవరెవరితో ఏం మాట్లాడారు, ఎంతమేర ఒప్పందాలు కుదిరాయనే దానిపై ఏసీబీ అధికారులు కీర్తన్ నుంచి వివరాలు రాబట్టే ప్రయత్నం చేసినట్లు సమాచారం.
కాగా, వేం నరేందర్ రెడ్డిని ఎసిబి అధికారులు ఇది వరకే ప్రశ్నించారు. వేం నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించడానికి టిడిపి శాసనసభ్యులు ఇతర పార్టీల శాసనసభ్యులను కొనుగోలు చేయడానికి ప్రయత్నించారనే ఆరోపణలపై కేసు నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసులో భాగంగా ఎసిబి అధికారులు టిడిపి ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్యలను అరెస్టు చేశారు. వారు బెయిల్పై జైలు నుంచి బయటకు వచ్చారు.