ఆనాడు కత్తులు: వైఎస్ కరెక్టంటూ తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కితాబు
న్యూఢిల్లీ: తెలంగాణ ఉద్యమ కాలంలో దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డిపై కత్తులు నూరిన ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వ నీటి సలహాదారు సలహాదారు ఇప్పుడు ప్రశంసిస్తున్నారు. నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో వైయస్ రాజశేఖర రెడ్డి విధానంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సాగునీటి ప్రాజెక్టులకి అన్ని రకాల అనుమతులు వచ్చిన తరువాతనే పనులు ప్రారంభించాలనే ఆలోచన సరికాదని ఆయన అన్నారు.
ప్రాజెక్టులపై సమగ్ర నివేదికలు, అనుమతులు సిద్ధంగా లేకపోయినా ప్రభుత్వాలు తమ లక్ష్యాలకి అనుగుణంగా ముందుకు సాగడమే మంచిదనే మాజీ ముఖ్యమంత్రి సర్గీయ రాజశేఖర్ రెడ్డి ఆలోచనే విధానమే సరైనదని తాను ఇప్పుడు గ్రహించినట్లు ఆయన తెలిపారు. వైఎస్ హయంలో మొదలుపెట్టిన జలయజ్ఞం ప్రాజెక్టులకి అనుమతులు లేవని తాను అభ్యంతరం చెప్పానని ఆయన అన్నారు.
తన అభ్యంతరంపై 'ప్రజల అవసరాలని, ప్రభుత్వ లక్ష్యాలని దృష్టిలో ఉంచుకొని ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో ముందుకు సాగడమే మంచిదని, ఎగువనున్న మహారాష్ట్ర అదే విధానం అవలంభిస్తున్నప్పుడు మనం మాత్రం ఆ విధంగా ఎందుకు చేయకూడదు? అనుమతుల కోసం కూర్చొంటే పుణ్యకాలం కాస్తా పూర్తయిపోతుంది. కాబట్టి ముందు పనులు ప్రారంభించి ఆ తరువాత అనుమతులు సాధించుకోవచ్చు. అయినా ఒక ప్రభుత్వం మొదలుపెట్టిన ప్రాజెక్టులన్నీ దాని హయంలోనే పూర్తయిపోవు కదా?' అని రాజశేఖర రెడ్డి అన్నట్లు ఆయన వివరించారు.
తాను వైయస్తో ఏకీభవించ లేక పోయాను గానీీ ఇప్పుడు ఆయన చెప్పిందే సరైనదని అర్థమైనట్లు ఆయన తెలిపారు. తెలంగాణా ప్రభుత్వం ప్రస్తుతం చేపడుతున్న పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పధకాలకి కూడా ఎటువంటి అనుమతులులేవని వాటికి కనీసం సమగ్ర ప్రాజెక్టు నివేదికలు (డీటేయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) కూడా లేవని ఆయన చెప్పారు.
వాటికి ఎటువంటి అనుమతులు లేకపోయినప్పటికీ స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి చెప్పినట్లుగా ప్రస్తుత పరిస్థితులలో వాటి నిర్మాణ కార్యక్రమాలు చేపట్టడమే తెలంగాణా ప్రభుత్వానికి మంచిదని విద్యాసాగర్ రావు అన్నారు. అనుమతులు లేవని, ప్రాజెక్టులలో ఏవో చిన్న చిన్న లోపాలున్నాయనే సాకుతో రాష్ట్రంలో ప్రతిపక్షాలు, రాజకీయ ఉద్దేశ్యాలతో కొన్ని మీడియా సంస్థలు వాటిని అడ్డుకోవడం తగదని ఆయన అన్నారు.
ప్రొఫెసర్ కోదండరాం, వి.హనుమంత రావు వంటి అచ్చమైన తెలంగాణ నేతలు కూడా తెలంగాణా ప్రాజెక్టులని అడ్డుకోవడం మంచిది కాదని అన్నారు. ఆ ప్రాజెక్టుల గురించి తెలిసీ తెలియకుండా ఏదేదో మాట్లాడేసి ప్రజలని గందరగోళ పరచవద్దని విద్యాసాగర్ రావు కోరారు.