వద్దంటే వద్దు... ఇద్దరు సీఎంలకు ఏపీ,తెలంగాణ విద్యార్థుల డిమాండ్..
కరోనా వైరస్ నేపథ్యంలో ఈ విద్యా సంవత్సవరం పరీక్షలను రద్దు చేసి తమను నేరుగా ప్రమోట్ చేయాలంటూ తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో #PromoteStudentsSaveFuture అనే హాష్ ట్యాగ్తో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. ఫిజికల్ డిస్టెన్స్,శానిటైజేషన్ తదితర అవసరమైన చర్యలు చేపడుతూ పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వాలు చెబుతున్నా.. విద్యార్థులు మాత్రం ఆందోళన చెందుతున్నారు.
విద్యార్థులు ఏమంటున్నారు..
'భవిష్యత్తులో మనం సాధించే సక్సెస్ గురించి ఆలోచించడానికి ఇది సమయం కాదు. కనీసం భవిష్యత్తును చూస్తామా లేదా అని ఆలోచించాల్సిన సమయం ఇది.' అని ఓ విద్యార్థి ట్విట్టర్లో పేర్కొన్నాడు. కరోనా సమయంలో పరీక్షల నిర్వహణ కారణంగా విద్యార్థులకు ట్రాన్స్పోర్ట్ సమస్య తలెత్తుతుందని మరో విద్యార్థి సోషల్ మీడియాలో వాపోయాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తాము గ్రామాల నుంచి నగరానికి వచ్చి పరీక్షలు రాయలేమని.. పరీక్షల కంటే తమకు జీవితాలే ముఖ్యమని మరో విద్యార్థి ట్విట్టర్లో పేర్కొన్నాడు.

హెచ్ఆర్డీ మార్గదర్శకాలు..
ఓవైపు పరీక్షల నిర్వహణకు మార్గదర్శకాల రూపకల్పన కోసం మానవ వనరుల అభివృద్ది(HRD) మంత్రిత్వ శాఖ యూజీసీ టాస్క్ ఫోర్స్ను నియమించగా.. మరోవైపు విద్యార్థుల నుంచి ఇటువంటి డిమాండ్ వినిపిస్తుండటం గమనార్హం. ఇదివరకు కర్ణాటక,మహారాష్ట్రల్లోనూ అక్కడి విద్యార్థులు సోషల్ మీడియాలో ఇలాంటి క్యాంపెయిన్ చేపట్టారు.

జూన్ 20 నుంచి తెలంగాణలో అందుకు అనుమతి..
డిగ్రీ,పీజీ పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టతనిచ్చింది. వాయిదా పడిన డిగ్రీ, పీజీ పరీక్షల నిర్వహణపై రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి మార్గదర్శకాలు జారీ చేసింది. చివరి సెమిస్టర్ పరీక్షలు మాత్రమే నిర్వహించాలని సూచించింది. డిగ్రీ, పీజీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు జూన్ 20 నుంచి చివరి సెమిస్టర్ పరీక్షలు నిర్వహించేందుకు యూనివర్సిటీలకు అనుమతినిచ్చింది. మిగతా సెమిస్టర్ విద్యార్థులను పరీక్షలు లేకుండానే తాత్కాలికంగా ప్రమోట్ చేయాలని.. వీరికి నవంబర్ లేదా డిసెంబర్ నెలల్లో పరీక్షలు నిర్వహించాలని సూచించింది. ప్రాజెక్టులు, సెమినార్లు, వైవాలు ఆన్లైన్లోనే నిర్వహించాలని చెప్పింది.












Click it and Unblock the Notifications