గొప్ప గౌరవం: ఖేల్ రత్నపై సానియా, తెలుగు రాష్ట్రాల సీఎంల అభినందనలు
హైదరాబాద్: తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్, భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జాను భారతదేశ అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్ రత్న వరించింది. కేంద్ర ప్రభుత్వం శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. దీంతో ఖేల్ రత్న అవార్డు దక్కించుకున్న తొలి మహిళా టెన్నిస్ ప్లేయర్గా సానియా రికార్డు సృష్టించింది.
ఖేల్ రత్న పురస్కారం మరిన్ని విజయాలు సాధించేందుకు తనలో స్ఫూర్తినిస్తుందని టెన్నిస్ స్టార్ సానియా మిర్జా పేర్కొంది. ‘‘ఖేల్ రత్న దక్కడం గొప్ప గౌరవం. నా దేశం నా మీద ఇంత ప్రేమ, గౌరవం చూపినందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా ఏళ్లుగా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ ప్రపంచవ్యాప్తంగా టోర్నీలు ఆడటం నాకు గర్వకారణం. నా శ్రమకు గుర్తింపునివ్వడం ద్వారా భారత ప్రభుత్వం నేను దేశం కోసం మరిన్ని విజయాలు సాధించడానికి అవసరమైన స్ఫూర్తి నింపింది. దేశ పౌరులందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.'' అని సానియా తన స్పందనను తెలియజేసింది.

సానియా మిర్జాను ఖేల్ రత్న పురస్కారం వరించడం పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ అభినందనలు తెలియజేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన ట్విట్టర్ ద్వారా సానియాకు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
Hearty congratulations @MirzaSania for being selected for the Rajiv Gandhi Khel Ratna Award. Wish you the best for future.
— N Chandrababu Naidu (@ncbn) August 14, 2015 ఖేల్ రత్నగా ఎంపికైన టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు తెలంగాణ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఆమెతోపాటు అర్జున అవార్డు దక్కించుకున్న బ్యాడ్మింటన్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్, రోలర్ స్కేటింగ్ ఆటగాడు అనూప్ కుమార్లను కూడా కేసీఆర్ అభినందించారు.
జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 29న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ అవార్డులు ప్రదానం చేస్తారు. ఖేల్ రత్న అవార్డు ప్రతిమతోపాటు రూ. 7 లక్షల నగదు, అర్జున అవార్డుకి ప్రతిమతోపాటు రూ. 5 లక్షల నగదు అందిస్తారు. తెలుగు తేజాలు కిడాంబి శ్రీకాంత్, అనూప్ కుమార్ యమాకు అర్జున అవార్డులు దక్కాయి. దీంతో హైదరాబాద్కు చెందిన ముగ్గురికి పురస్కారాలు దక్కాయి.
పురస్కార వివరాలు:
ఖేల్ రత్న: సానియా మీర్జా (టెన్నిస్)
అర్జున అవార్డు: పీఆర్ శ్రీజేష్ (హాకీ), దీపా కర్మాకర్ (జిమ్నాస్టిక్స్), జీతూ రాయ్ (షూటింగ్), సందీప్ కుమార్ (ఆర్చరీ), మన్దీప్ జాంగ్రా (బాక్సింగ్), బబిత (రెజ్లింగ్), బజ్రంగ్ (రెజ్లింగ్), రోహిత్ శర్మ (క్రికెట్), కె. శ్రీకాంత్ (బ్యాడ్మింటన్), స్వర్ణ్ సింగ్ విర్క్ (రోయింగ్), సతీష్ శివలింగం (వెయిట్లిఫ్టింగ్), యుమ్నమ్ సంతోయ్ దేవి (ఉషు), శరత్ గైక్వాడ్ (పారా-సెయిలింగ్), ఎంఆర్ పూవమ్మ (అథ్లెటిక్స్), మన్జీత్ చిల్లార్ (కబడ్డీ), అభిలాష మాత్రె (కబడ్డీ), అనూప్ కుమార్ (రోలర్ స్కేటింగ్).












Click it and Unblock the Notifications