రెచ్చగొట్టొద్దు: దత్తాత్రేయ, రంగంలోకి కేంద్రం, బాబు-కేసీఆర్లతో భేటీ!
హైదరాబాద్: హైకోర్టు విభజన పైన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబులు సామరస్య పూర్వకంగా మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అవుతుందని, కేంద్రం కూడా సమస్య పరిష్కారానికి సిద్ధంగా ఉందని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ శనివారం చెప్పారు.
హైకోర్టు విభజన అంశంలో కేంద్రాన్ని తప్పుపట్టడం సరికాదని ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు సూచించారు. హైకోర్టు ఏర్పాటు పైన తెలంగాణ సీఎం న్యాయపరంగా ముందుకెళ్లాలని, ఏపీ సర్కార్ కూడా అవసరమైన ప్రక్రియను వెంటనే ప్రారంభించాలన్నారు.
న్యాయవాదులు, జడ్జిలను రెచ్చగొట్టేలా తెరాస చేయడం సరికాదని దత్తాత్రేయ అన్నారు. న్యాయవాదుల ఆందోళనలో అర్థముందని, తమ తప్పులు కప్పి పుచ్చుకునేందుకు తెరాస నేతలు కేంద్రం పైన నిందలు వేస్తున్నారని దుయ్యబట్టారు.
బీజేపీ నేత నాగం జనార్ధన్ రెడ్డి మీడియా సమావేశాన్ని తెరాస నేతలు అడ్డుకోవడాన్ని దత్తాత్రేయ తీవ్రంగా ఖండించారు. దాడులు చేసేవారు రాజకీయ అసమర్థులు అని, వానాకాలం రాకముందే హైదరాబాదులోని నీటి గుంతల్లో పడి నలుగురు చనిపోయారని, మంత్రి కేటీఆర్ స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.
కేసీఆర్, బాబులతో కేంద్రం భేటీ
ఉమ్మడి హైకోర్టు విభజన, దానికి సంబంధించిన ఇతర అంశాలపై కేంద్ర ప్రభుత్వం త్వరలో ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులతో సమావేశం కానుంది. కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ అధ్యక్షతన జరిగే ఈ భేటీకి గవర్నర్ నరసింహన్ హాజరు కానున్నారు.
ఇందుకు సంబంధించి ఒకటి, రెండు రోజుల్లో ముఖ్యమంత్రులకు ఆహ్వానం రానుంది. మొదట హైదరాబాదులో గవర్నర్ ఈ సమావేశాన్ని నిర్వహించాలని కేంద్రం సూచించింది. అయితే, కేంద్ర స్థాయిలోనే దీనిని నిర్వహించాలని ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్లు అభిప్రాయపడ్డారు.
దీనికి తోడు.. రాష్ట్రంలో న్యాయాధికారులు, న్యాయవాదుల ఆందోళనల దృష్ట్యా సమావేశాన్ని ఢిల్లీలో నిర్వహించేందుకే కేంద్రం నిర్ణయించినట్లు తెలిసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం గవర్నర్ నరసింహన్తో భేటీ అయ్యారు.
రాజ్భవన్లో దాదాపు గంటన్నరసేపు వీరి మధ్య సమావేశం జరిగింది. గత మూడు రోజుల్లో ఇది రెండోసారి భేటీ. ఈ సందర్భంగా హైకోర్టు విభజన, కేంద్రం వైఖరి తదితర అంశాలపై వారు చర్చించారని సమాచారం. హైకోర్టు విభజన సత్వరమే జరగాలనీ, న్యాయాధికారులు, న్యాయవాదుల ఆందోళనల నేపథ్యంలో కేంద్రం సత్వరమే నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్ అన్నారు.
తుది నిర్ణయం తీసుకునేవరకు ఆందోళనలు కొనసాగే అవకాశముందన్నారు. ఈ విషయమై కేంద్రం స్పందనను గవర్నర్ వెల్లడించారని తెలుస్తోంది. హైకోర్టు విభజనలో జాప్యం, న్యాయాధికారుల కేటాయింపుల తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన కేసీఆర్.. ఢిల్లీలో ధర్నా చేయాలని భావించారు. దీంతో కేంద్రం అప్రమత్తమై ఈ అంశంపై దృష్టి సారించింది.