Huzurabad: రాష్ట్రంలో మరో నిరుద్యోగి ఆత్మహత్య-నోటిఫికేషన్ల కోసం ఎదురుచూసి చూసి...
తెలంగాణలో నిరుద్యోగుల చావులు కలకలం రేపుతున్నాయి. తాజాగా మరో నిరుద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఎదురుచూసి చూసి ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. ఉద్యోగం లేకపోవడం,ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతుండటంతో ఆ యువకుడు మానసికంగా కుమిలిపోయాడు. చివరకు రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఈ ఘటన చోటు చేసుకుంది. హుజురాబాద్ ఉపఎన్నిక వేళ నియోజకవర్గంలో నిరుద్యోగి ఆత్మహత్యపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉంది.
ఊరించి ఉసూరుమనిపించి-నిరుద్యోగులతో కేసీఆర్ సర్కార్ చెలగాటం-ఎన్నికల స్టంటేనా..?
రైలు కింద పడి ఆత్మహత్య
జమ్మికుంట రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం(అగస్టు 1) గుర్తు తెలియని రైలు కింద పడి షబ్బీర్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.షబ్బీర్ను ఇల్లందకుంట మండలం సిరివేడు గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతని సెల్ఫోన్ ఆధారంగా గుర్తించిన పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. షబ్బీర్ జేబులో ఉన్న సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. ఉద్యోగం సాధించకపోవడం వల్లే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు షబ్బీర్ అందులో పేర్కొన్నాడు.
'నా చావుకు కారణం నిరుద్యోగం'
'నా చావుకు కారణం నిరుద్యోగం. తెలంగాణ వస్తే ఉద్యోగం వస్తదని ఎంతో ఆశగా ఎదురుచూశా. నన్ను మా అమ్మా నాన్న ఎంతో కష్టపడి డిగ్రీ,ఐటీఐ చదివించారు. కానీ నాకు ఉద్యోగం రాలేదు. నోటిఫికేషన్ల కోసం ఎదురుచూసి చూసి ఏజ్ లిమిట్ కూడా అయిపోయేలా ఉంది.నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఎంత ఆలోచించినా చావు ఒక్కటే మార్గం అనిపించింది. అందుకే చనిపోతున్నా. నన్ను నమ్మి నన్ను పెళ్లి చేసుకున్న రేష్మకి సారీ.నేను ఏ ఉద్యోగం సాధించలేకపోయాను.నాకు చావు తప్ప వేరే దిక్కు లేదు.అందుకే చనిపోతున్నా.' అంటూ సూసైడ్ నోట్లో షబ్బీర్ పేర్కొన్నాడు.
9 నెలల క్రితమే పెళ్లి...
షబ్బీర్కు 9 నెలల క్రితమే వివాహం జరిగింది. హైదరాబాద్లోని పలు కంపెనీల్లో కొంత కాలం పనిచేశాడు. ఇంతలోనే కరోనా కారణంగా చేస్తున్న ఆ చిన్నపాటి ఉద్యోగం కూడా పోయింది. దీంతో జమ్మికుంటకు వెళ్లి భార్యతో కలిసి అక్కడే అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఉద్యోగం లేకపోవడంతో అద్దె చెల్లించడం కూడా కష్టంగా మారింది.కొన్నాళ్ల పాటు సోదరులే ఇంటి అద్దె చెల్లించారు. ఉద్యోగం కోసం చాలానే ప్రయత్నించినప్పటికీ అవేవీ సఫలం కాలేదు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు కూడా రాకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందాడు. ఆర్థిక ఇబ్బందులు,ఉద్యోగం లేకపోవడం... చివరకు ఆత్మహత్యే శరణ్యమనుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
న్యాయం చేయాలని డిమాండ్...
షబ్బీర్ తల్లిదండ్రులు కూలీ పనులు చేసి ముగ్గురు కొడుకులను చదివించారు. ముగ్గురిలో షబ్బీర్ చిన్నవాడు. ఇద్దరు సోదరులు డిగ్రీ చదివి ప్రస్తుతం ఉద్యోగాల్లో ఉన్నారు. షబ్బీర్ మృతితో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఇల్లందకుంట మండలం కేంద్రంలో ఆదివారం ఆందోళన చేపట్టారు.బాధిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగంతో పాటు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలీసులు జోక్యం చేసుకోవడంతో వారు నిరసన విరమించారు.
Recommended Video
ఇంకెప్పుడు నోటిఫికేషన్లు..?
తెలంగాణలో 50వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామని గతేడాది డిసెంబర్లో ప్రకటించిన ప్రభుత్వం... ఇప్పటికీ దాన్ని అమలుచేయలేదు. మధ్యలో ఎమ్మెల్సీ ఎన్నికలు,హుజూర్ నగర్ ఉపఎన్నిక రావడంతో... వాటి తర్వాత నోటిఫికేషన్ ఉంటుందేమోనని భావించారు. కానీ ఆ ఎన్నికలు ముగిసి రెండు నెలలు గడిచినా నోటిఫికేషన్లు వచ్చే సూచనలు కనిపించట్లేదు. గత నెలలో వరుసగా రెండు రోజులు జరిగిన కేబినెట్ సమావేశంలో ఉద్యోగ నోటిఫికేషన్లపై చర్చించినప్పటికీ... ఖాళీల వివరాలు అసమగ్రంగా ఉన్నాయన్న కారణంతో మరింత సాగదీసే ప్రయత్నమే చేశారు. ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇస్తామని ప్రకటించగానే చాలామంది నిరుద్యోగులు కోచింగ్ సెంటర్లలో చేరారు. కానీ ఇంతలోనే కరోనా కారణంగా అవి మూతపడ్డాయి. మరోవైపు ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వడం లేదు. దీంతో నిరుద్యోగుల్లో తీవ్ర నిరాశ,నిస్పృహ నెలకొంది. నోటిఫికేషన్లు వేయాలని ప్రతిపక్షాలు,నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం మాత్రం తాత్సారం చేస్తూనే ఉంది.