ఎల్లలు లేని కళావైభవం: 'అమరావతి'కి తెలంగాణ చేయూత, విరాళాలు
హైదరాబాద్/విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి విరాళాలు సేకరించేందుకు తెలంగాణ రాష్ట్రానికి చెందిన కళాకారులు తమ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించనున్నారు. ఇందుకోసం కల్చలర్ సెంటర్ ఆఫ్ విజయవాడ (సిసివి) ఈ నెల 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఓ శిబిరాన్ని నిర్వహిస్తోంది.
మూడు రోజుల పాటు విజయవాడలోని ఓ చాంబర్స్లో ఆర్ట్ బియాండ్ బౌండరీస్ పేరుతో కళాశిబిరాన్ని నిర్వహించనుంది. ఈ విషయాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త మహాలక్ష్మీ గ్రూప్ చైర్మన్, సిసివి వ్యవస్థాపకులు హరీష్ చంద్రప్రసాద్ ఓ ప్రకటనలో చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ కళా శిబిరాన్ని ప్రారంభించనున్నారు. ప్రసిద్ధ చిత్రకారులు ఏలె లక్ష్మణ్ వంటి వారు తమ పెయింటింగులను ప్రదర్శించనున్నారు. ఈ పేయింటింగులను వేలం వేయడం ద్వారా ఆ డబ్బును ఏపీ నూతన రాజధాని అభివృద్ధికి అందిస్తారు.
కాగా, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావును ఆహ్వానించనున్నారు. ఈ నెల 18వ తేదీన కెసిఆర్ ఇంటికి వెళ్లి చంద్రబాబు ఆహ్వానించనున్నారు.
ఈ శంకుస్థాపన రోజునే కెసిఆర్కు ఓ కార్యక్రమం ఉంది. ఈ నేపథ్యంలో మంత్రి కెటిఆర్ తదితరులు హాజరయ్యే అవకాశాలున్నాయి. శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానిస్తే తాము వెళ్తామని కెటిఆర్ చెప్పిన విషయం తెలిసిందే.