తెలంగాణ కాంగ్రెస్ మొదలెట్టేసింది..!!
Revanth Reddy: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. సరిగ్గా ఈ ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లతో కౌంటింగ్ మొదలైంది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. అదే దూకుడును ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల కొనసాగించింది హస్తం పార్టీ. తొలి గంటలోనే పూర్తిస్థాయి మెజారిటీని సాధించింది.
తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్.. 60. ఈ మార్క్ను అలవోకగా అందుకుంది కాంగ్రెస్. తొలి రౌండ్ నుంచే ఆధిక్యతను ప్రదర్శిస్తూ వచ్చింది. ఎక్కడే గానీ వెనుకంజ వేసినట్లు కనిపించలేదు. పోస్టల్ బ్యాలెట్లలో సాధించిన పైచేయిని ఈవీఎం లెక్కింపుల్లోనూ కంటిన్యూ చేసింది.

66 స్థానాల్లో కాంగ్రెస్, 40 నియోజకవర్గాల్లో భారత్ రాష్ట్ర సమితి అభ్యర్థులు ఆధిక్యతలో కనిపించారు. అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్.. అయిదు చోట్ల లీడింగ్లో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కూడా తన ఆధిక్యతను పెంచుకోగలిగింది. తొలుత మూడు చోట్ల లీడింగ్లో ఉన్న కమలం పార్టీ అభ్యర్థులు ఆ తరువాత ఏడు చోట్ల పైచేయి సాధించారు.
సంపూర్ణ మెజారిటీ సాధించే దిశగా కాంగ్రెస్ అడుగులు పడిన ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పార్టీ నేతల్లో జోష్ పెరిగింది. పెద్ద ఎత్తున ఉత్సవాలు మొదలు పెట్టేశారు. బాణాసంచా కాల్చుతూ సంబరాల్లో మునిగిపోయారు. హైదరాబాద్లోని గాంధీభవన్ సహా జిల్లా కార్యాలయాల్లో సందడి నెలకొంది.
హైదరాబాద్లో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత రేవంత్ రెడ్డి ఇంటికి భారీ సంఖ్యలో చేరుకున్నారు కాంగ్రెస్ నేతలు. పార్టీ జెండాలను ప్రదర్శిస్తూ జైకొట్టారు. పార్టీ మాజీ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఫ్లెక్సీలు, బ్యానర్లను వెంట తీసుకొచ్చారు.. వారికి జిందాబాద్ పలికారు.












Click it and Unblock the Notifications