ఇంట్రెస్టింగ్ : తెలంగాణలో హంగ్ వస్తే గవర్నర్ ఎటువైపు నిలుస్తారు..?
తెలంగాణలో డిసెంబర్ 7న జరిగిన ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయాలు వేడెక్కాయి. ఇప్పటికే విజయం తమదంటే తమదేనంటూ ఇటు టీఆర్ఎస్ అటు ప్రజాకూటమి నేతలు కాన్ఫిడెన్స్తో ఉన్నారు. ప్రస్తుతం ఒకపార్టీ నేతలు మరోపార్టీ నేతలను కలవడం... ప్రజాకూటమి నేతలు గవర్నర్ కలవడం వంటి పరిణామాలు చూస్తుంటే తెలంగాణలో హంగ్ ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే గవర్నర్ ఇక్కడ కీలకం కానున్నారు... నిజంగా హంగ్ వస్తే పరిస్థితులు ఎలా ఉండబోతాయి...? గవర్నర్ ఎవరివైపు నిలిచే అవకాశం ఉంది..?
తెలంగాణలో హంగ్ వస్తుందా...?
తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జాతీయ సర్వేలన్నీ దాదాపుగా టీఆర్ఎస్ పార్టీ స్పష్టమైన మెజార్టీ సాధిస్తుందని చెప్పడంతో గులాబీ దళం ఊపిరి పీల్చుకుంది. అయితే ఒక్కసారిగా లగడపాటి రాజగోపాల్ తన సర్వేను బయటకు పెట్టడంతో ఎవరు అధికారంలోకి వస్తారా అనే దానిపై చర్చ జరుగుతోంది. అంతేకాదు హంగ్ కూడా వచ్చే అవకాశం ఉందనే వాదన కూడా వినిపిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ తమ జాతీయ నాయకులను హైదరాబాద్కు వెళ్లి పరిస్థితులను సమీక్షించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు అసదుద్దీన్ సీఎం కేసీఆర్ను కలవడం... ప్రజాకూటమి నేతలు గవర్నర్ను కలవడం చూస్తే హంగ్ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే క్యాంపు రాజకీయాలు తప్పవనే మరో వెర్షన్ కూడా వినిపిస్తోంది. ఒకవేళ హంగ్ ఏర్పడితే గవర్నర్ ఎలా వ్యవహరిస్తారనేదానిపై చర్చ జరుగుతోంది. ఎందుకంటే గవర్నర్ నరసింహన్ ఇటు ప్రధాని నరేంద్ర మోడీకి అటు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఇద్దిరికి దగ్గర వ్యక్తి కావడం విశేషం.
గోవాలో హంగ్ రావడంతో చక్రం తిప్పిన బీజేపీ
గతంలో గోవా ఎన్నికలను , రీసెంట్గా జరిగిన కర్నాటక ఎన్నికలనే ఉదాహరణగా తీసుకుంటే అక్కడ కూడా గవర్నరే కీలకంగా వ్యవహరించారు. గోవాలో 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెల్చుకున్న పార్టీగా కాంగ్రెస్ అవతరించగా... గవర్నర్ మాత్రం ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని ఆహ్వానించారు. దీంతో బీజేపీ పార్టీ గోవా ఫార్వర్డ్ పార్టీ, మహారాష్ట్రవాడి గోమంతక్ పార్టీ, ముగ్గురు ఇండిపెండెట్ల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు గెలుచుకున్నప్పటికీ గోవాలో ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయింది.
కర్నాటకలో కాంగ్రెస్ గేమ్ ప్లాన్ ముందు ఓడిన బీజేపీ
ఇక కర్నాటకలో కూడా అదే జరిగింది. అయితే ఇక్కడ బీజేపీకి మాత్రం చుక్కెదురైంది. కర్నాటకలో అత్యధిక సీట్లు గెలుచుకున్న పార్టీగా బీజేపీ నిలిచింది. సమయం ఇస్తే బలనిరూపణ చేసుకుంటామంటూ గవర్నర్ దగ్గరకు వెళ్లారు నాటి సీఎం అభ్యర్థి యడ్యూరప్ప. నాటకీయ పరిణామాల మధ్య యడ్యూరప్ప సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. చేసిన కొన్ని గంటల్లోనే కాంగ్రెస్ పార్టీ జేడీయూతో చర్చలు జరిపింది. కుమార స్వామి మద్దతు తెలపడంతో కాంగ్రెస్ అభ్యర్థి సీఎంగా ఉండకపోయినా ఫర్వాలేదు కానీ బీజేపీ మాత్రం అధికారంలోకి రాకూడదని విశ్వప్రయత్నాలు చేసి విజయం సాధించింది. బలనిరూపణలో యడ్యూరప్ప ఫెయిల్ అవడంతో కుమారస్వామిని ప్రభుత్వం ఏర్పాటు చేశారు.
హంగ్ వస్తే గవర్నర్ ఎటువైపు..?
ఇదంతా ఒక పిక్చర్ అయితే ఇక తెలంగాణలో నెంబర్ గేమ్ చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. హంగ్ రావొచ్చనే సంకేతాలు హైకమాండ్కు అందడంతో కర్నాటకలో ట్రబుల్ షూటర్గా వ్యవహరించిన డీకే శివకుమార్ను రంగంలోకి దింపింది. ఆయనతో పాటు కర్నాటకలో కీలకంగా వ్యవహరించిన ఆజాద్తో పాటు మరికొంతమంది నాయకులు చక్రం తిప్పేందుకు హైదరాబాద్కు చేరుకోనున్నారు. మరోవైపు కూటమిని ఒక పార్టీ కిందే చూడాలని ఎన్నికలకు ముందే తాము కూటమిగా ఏర్పడ్డట్లు గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు. ఒకవేళ వారికి అత్యధిక సీట్లు వస్తే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్కు వినతి పత్రం అందజేశారు ప్రజాకూటమి నాయకులు. అయితే గవర్నర్ ఎలా వ్యవహరిస్తారో హంగ్ వస్తే ఎవరిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తారో అనేదానిపై సర్వత్ర చర్చ జరుగుతోంది. అంతేకాదు గవర్నర్ నరసింహన్ అటు ప్రధాని నరేంద్ర మోడీకి ఇటు కేసీఆర్కు దగ్గరి వ్యక్తి అవడంతో ఎటువైపు మొగ్గు చూపుతారో వేచిచూడాలి.