బిఎసి సమావేశం: తొలిరోజే ధర్నాలా? కాంగ్రెస్ నేతలపై కెసిఆర్ ఫైర్
అక్టోబర్ 27వ, తేది నుండి నవంబర్ 30వ, తేది వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని బిఎసి సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు.వంద రోజుల పాటు సమావేశాలు నిర్వహించేందుకు తాము సిద్దంగా ఉన్నామని బిఎసి సమా
హైదరాబాద్: అక్టోబర్ 27వ, తేది నుండి నవంబర్ 30వ, తేది వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని బిఎసి సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు.వంద రోజుల పాటు సమావేశాలు నిర్వహించేందుకు తాము సిద్దంగా ఉన్నామని బిఎసి సమావేశంలో కెసిఆర్ ప్రకటించారు.రాష్ట్రంలో ప్రధానమంత్రి మోడీ పర్యటన సందర్భంగా అసెంబ్లీకి మూడు రోజుల పాటు సెలవు ఇవ్వాలని నిర్ణయం తీసుకొన్నారు. అసెంబ్లీ సమావేశం తొలిరోజే ఛలో అసెంబ్లీకి కాంగ్రెస్ పిలుపునివ్వడంపై సిఎం కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను పురస్కరించుకొని బిఎసి సమావేశం గురువారం మధ్యాహ్నం అసెంబ్లీలో జరిగింది. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. అనారోగ్య కారణాలతో ఈ సమావేశానికి స్పీకర్ మధుసూదనాచారి హజరుకాలేదు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై బిఎసి సమావేశంలో చర్చించారు. బిఎసి సమావేశంలో 50 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకొన్నారు.
అయితే వంద రోజుల పాటు సమావేశాలు నిర్వహించి బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు తాము సిద్దంగా ఉన్నామని కెసిఆర్ ప్రకటించారు.అయితే వాయిదా తీర్మాణాలపై చర్చించాలని కాంగ్రెస్ పట్టుబడితే ప్రభుత్వం తోసిపుచ్చింది. మరోసారి శుక్రవారం నాడు బిఎసి సమావేశం కానుంది.
50 రోజుల పాటు సెషన్స్
అక్టోబర్ 27వ, తేది నుండి నవంబర్ 30వ, తేదివరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బిఎసి నిర్ణయించింది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చించారు. అక్టోబర్ 27న, సభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాల సమయం అనంతరం శాసనసభ వాయిదా పడనుంది. ప్రశ్నోత్తరాల సమయాన్ని మరో అరగంట పొడిగించారు. రేపు జరగనున్న బీఏసీ సమావేశంలో ఎజెండా ఖరారు చేస్తారు.
వందరోజులు సమావేశాలు నిర్వహణకు రెఢీ
వంద రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ బిఎసి సమావేశంలో ప్రకటించారు. పనిలో పనిగా బడ్జెట్ సమావేశాలు కూడ నిర్వహించుకొందామని సిఎల్పీ నేత జానారెడ్డి సూచించడంతో కెసిఆర్ తనకు అభ్యంతరం లేదని ప్రకటించారు.మాట్లాడే అవకాశం కల్పిస్తామంటే ఎందుకు వెనుకాడుతున్నారని సీఎం కెసిఆర్ ప్రశ్నించారు.
.ప్రతి రోజూ ప్రశ్నోత్తరాలు
ప్రతి రోజూ ప్రశ్నోత్తరాలను నిర్వహించాలని బిఎసి సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు. ఈ సమావేశంలో కనీసం 10 ప్రశ్నలకు తగ్గకుండా ప్రశ్నలు ఉండాలని అభిప్రాయపడ్డారు. అంతేకాదు జీరో అవర్తో పాటు పిటిషన్ అవర్ను కూడ కొనసాగించాలని బిఎసి సమావేశం నిర్ణయం తీసుకొంది. ప్రశ్నోత్తరాల కంటే ముందు వాయిదా తీర్మాణాలపై చర్చకు కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టింది. అయితే దీనికి సిఎం కెసిఆర్ ఒప్పుకోలేదు.
మొదటి రోజే ధర్నా చేస్తారా?
అసెంబ్లీ సమావేశాల మొదటి రోజే ధర్నా చేస్తారా అంటూ సీఎం కెసిఆర్ బిఎసి సమావేశంలో కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. అయితే వాయిస్ లేనోళ్ళే ధర్నాలు చేస్తారని సీఎం కెసిఆర్ అన్నారు. ప్రతి శని, ఆదివారాలు అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. అంతేకాదు రాష్ట్రంలో మోడీ పర్యటనను పురస్కరించుకొని మూడు రోజుల పాటు అసెంబ్లీకి సెలవు ఇవ్వాలని నిర్ణయం తీసుకొన్నారు. అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలపై అక్టోబర్ 27న, మరోసారి బిఎసి సమావేశమై నిర్ణయం తీసుకొంటుంది.