క్వారంటైన్లో కేసీఆర్ కుటుంబం?
ఎంఐఎం కనుసన్నల్లోనే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) పని చేస్తోందని భారతీయ జనతాపార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పీఎఫ్ఐని పెంచి పోషిస్తోందని, జిమ్లు ఏర్పాటు చేయడం, స్వచ్చంద సంస్థల పేర్లను ఉపయోగించుకోవడంద్వారా ఆ సంస్థ విస్తరిస్తోందన్నారు. ఎన్ఐఏ వచ్చి సోదాలు జరిపే వరకు పీఎఫ్ఐ గురించి ప్రభుత్వానికి తెలియలేదా? అని ప్రశ్నించారు. ఎంఐఎం ఆగడాలను అడ్డుకునేది బీజేపీ ఒక్కటేనని, ఏ స్కాం బయట పడినా కేసీఆర్ కుటుంబం పాత్ర ఉంటోందని విమర్శించారు. బిడ్డ తప్పు చేసినా జైలులో పెడతానన్న ముఖ్యమంత్రి లిక్కార్ స్కాం గురించి ఎందుకు నోరు మెదపడంలేదన్నారు. సీబీఐ, ఈడీ దాడులు చూసి కేసీఆర్ కుటుంబం క్వారంటైన్ కు పోతోందని ఎద్దేవా చేశారు.
హైదరాబాద్, నిజామాబాద్, జగిత్యాల, తదితర ప్రాంతాల్లో పీఎఫ్ఐకు సంబంధించి ఎన్ఐఏ సోదాలు జరిపింది. తెలంగాణ వ్యాప్తంగా 38 ప్రాంతాల్లో సోదాలు జరిగాయి. ఈ సందర్భంగా అధికారులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని 30 రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని ఎన్ఐఏ నాంపల్లి కోర్టును కోరింది. ఉగ్రమూలాలున్నాయనే కోణంలో దేశవ్యాప్తంగా పీఎఫ్ ఐ శిక్షణ ఇచ్చే కార్యక్రమాలపై నిఘా ఉంచారు. ఈ నలుగురి ఆర్థిక లావాదేవీలు, బ్యాంకు ఖాతాలు, డైరీలు, పుస్తకాలు, నిధులు సేకరణ వివరాలు సేకరించారు. సిమి ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నట్లు భావిస్తున్నారు.