ఇలాగే వదిలేస్తే..అన్నీ ఖాళీ: తెలంగాణలో యూపీ తరహా బిల్లు: కేసీఆర్కు రాజాసింగ్ లేఖ
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ సరికొత్త వ్యూహాన్ని అనుసరించడం మొదలు పెట్టినట్టు కనిపిస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను ఆధారంగా చేసుకుని జనాభా నియంత్రణ బిల్లు కోసం గొంతెత్తుతోంది. ఉత్తర ప్రదేశ్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం ఈ బిల్లును రూపొందించింది. దీన్ని వచ్చే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సభలో ప్రవేశపెట్టనుంది. అస్సాం వంటి ఒకట్రెండు రాష్ట్రాలు కూడా జనాభా నియంత్రణ బిల్లును సమర్థిస్తోన్నాయి. వాటిపై అధ్యయనం ఆరంభించాయి.

కేసీఆర్కు లేఖ
తెలంగాణలోనూ జనాభా నియంత్రణను అమలు చేయాలనే డిమాండ్ను అందుకుంది బీజేపీ. జనాభా పెరుగుదలను నియంత్రించడానికి అవసరమైన బిల్లును రూపొందించాలంటూ హైదరాబాద్ గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే టీ రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆయన లేఖ రాశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ఈ పరిస్థితుల్లో జనాభా పెరుగుదల మరిన్ని అధ్వాన్న పరిస్థితులకు దారి తీస్తాయని, ప్రాథమిక అవసరాలను తీర్చుకోవడం కూడా కష్టసాధ్యమౌతోందని అన్నారు.

తెలంగాణలో నాలుగు కోట్ల జనాభా
భవిష్యత్ తరాలకు నాణ్యమైన విద్య, వైద్యం, జీవన ప్రమాణాలను మరింత మెరుగుపరిచే మౌలిక సదుపాయాలను కల్పించాలంటే జనాభాను నియంత్రించడానికి తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. తెలంగాణలో జన సంఖ్య నాలుగు కోట్లకు చేరువ అవుతోందని టీ రాజాసింగ్ తెలిపారు. గత ఏడాది డిసెంబర్ 31వ తేదీ నాటికి ఆధార్ విభాగం తెలిపిన వివరాల ప్రకారం.. 3,85,10,982 మంది ప్రజలు నివసిస్తోన్నట్లు ఆధార్ అంచనా వేసిందని పేర్కొన్నారు.

ప్రభుత్వ పథకాల అమలులో సవాళ్లు..
ఇన్ని కోట్ల మంది ప్రజలకు అందేలా ప్రభుత్వ పథకాలను అమలు చేయడం సవాళ్లతో కూడుకుని ఉంటుందని టీ రాజాసింగ్ చెప్పారు. పింఛన్లు, నిత్యావసర సరుకుల పంపిణీ, అభివృద్ధి పనులను అందరికీ అందడం సాధ్యం కాకపోవచ్చని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు ఆర్థిక లోటును ఎదుర్కొంటోన్నందున పెరుగుతోన్న ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను సమకూర్చాల్సి రావడం కష్టమని చెప్పారు. ఉత్తర ప్రదేశ్, అస్సాం ముఖ్యమంత్రులు, యోగి ఆదిత్యనాథ్, హిమంత బిశ్వశర్మ ఇప్పటికే జనాభా నియంత్రణ బిల్లుపై కసరత్తు మొదలు పెట్టారని గుర్తు చేశారు.
Recommended Video

ఇద్దరు పిల్లలు..
జనాభా నియంత్రణలో భాగంగా రాష్ట్రంలో ఇద్దరు పిల్లల విధానాన్ని ప్రవేశ పెట్టాలని టీ రాజాసింగ్ డిమాండ్ చేశారు. అందుబాటులో ఉన్న వనరులు.. కొన్ని తరాల వరకు మనుగడలో ఉండటానికి జనాభా నియంత్రణ తప్పనిసరి అని పేర్కొన్నారు. మితిమీరిన జనాభా వల్ల సహజ వనరులు ఖాళీ అవుతాయని పేర్కొన్నారు. ప్రజలందరికీ నాణ్యమైన ఆహారం, మంచినీరు, నివాస వసతి, విద్య, వైద్యం, విద్యుత్ వంటి కనీస వసతులను కల్పించలేని పరిస్థితులను అధిగమించడానికి జనాభాను నియంత్రించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఈ దిశగా తక్షణ చర్యలు చేపట్టాలని అన్నారు.












Click it and Unblock the Notifications