నేటినుండి తెలంగాణా బోనాల జాతర షురూ.. గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మకు తొలి బంగారు బోనం
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే బోనాల పండుగ నేటి నుండి ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆషాడమాసంలో హైదరాబాద్ నగరంలో అత్యంత వైభవంగా నిర్వహించే బోనాల పండుగతో నగరానికి కొత్త శోభ సంతరించుకుంది. శ్రీ జగదాంబ మహంకాళి గోల్కొండ బోనాల ఉత్సవాల దృష్ట్యా, జూన్ 30 నుండి జూలై 28 వరకు వివిధ తేదీలలో తొమ్మిది రోజుల పాటు జరిగే ఉత్సవాలకు నగరం నలుమూలల నుండి మరియు చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారు.
నేడు జగదాంబికా ఎల్లమ్మ అమ్మవారికి తొలి బోనం
నేడు గోల్కొండ జగదాంబికా ఎల్లమ్మ అమ్మవారికి తొలి పూజలు నిర్వహించడంతో బోనాల సంబరాలు ప్రారంభమవుతాయి. ఈ పూజలో భాగంగా అమ్మవారికి మొదటి నజర్ బోనం సమర్పించనున్నారు. ఈరోజు లంగర్ హౌస్ చౌరస్తా నుంచి గోల్కొండ కోట కు నజర్ బోనం, తొట్టెలను భారీ ఊరేగింపుతో తీసుకువెళ్తారు. ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంటకు ఊరేగింపు ప్రారంభమై రాత్రి 8 గంటలకు కోటపై ఉన్న అమ్మవారి ఆలయానికి చేరుకుంటుంది.
లంగర్ హౌస్ చౌరస్తాలో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న మంత్రులు
గోల్కొండ బోనాలు ఘనంగా ప్రారంభిస్తున్న క్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మధ్యాహ్నం 12 గంటలకు లంగర్ హౌస్ చౌరస్తాలో అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం లంగర్ హౌస్ చౌరస్తా నుంచి ఊరేగింపుతో జాతర ప్రారంభమవుతుంది. గత రెండు సంవత్సరాలుగా కరోనా మహమ్మారి కారణంగా పూర్తిస్థాయిలో బోనాల జాతర జరగలేదు. కానీ ఈ సంవత్సరం బోనాల జాతర పూర్తి స్థాయిలో జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు తరలి వచ్చే అవకాశం కనిపిస్తోంది.
భక్తులకు ఇబ్బంది లేకుండా వసతులు, ట్రాఫిక్ మళ్లింపులు
భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించడంపై ఆలయ ట్రస్టు అధికారులు దృష్టి సారించారు. ఇక మరోవైపు బోనాల సందర్భంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు బోనాల జాతర నిర్వహించే పరిసరాలలో కొన్ని ఆంక్షలు విధించారు. జూన్ 30 మరియు జూలై 3, 7, 10, 14, 17, 21, 24 మరియు 28 తేదీలలో, రామదేవ్గూడ నుండి మక్కై దర్వాజ మీదుగా గోల్కొండ కోటకు వెళ్లే మార్గాల్లో భారీ ట్రాఫిక్ రద్దీ ఉంటుందని భావిస్తున్నారు. ఈ క్రమంలో పలు చోట్ల ట్రాఫిక్ మళ్లింపు చేపట్టారు.
Recommended Video
తొమ్మిది వారాల పాటు ఆషాడ బోనాలు
బోనాల ఉత్సవాల సందర్భంగా నగరంలోని బస్తీలతో పాటు, కాలనీలన్నీ కళకళలాడుతున్నాయి. భక్తులు తమ ఇష్టదైవానికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకోవడానికి రెడీ అవుతున్నారు. ఈరోజు నుంచి వచ్చే నెల 28వ తేదీ వరకు తొమ్మిది వారాల పాటు ఆషాడ బోనాలను ఘనంగా నిర్వహించటానికి అధికారులు ఘనంగా ఏర్పాట్లు చేశారు.