3 నుంచి తెలంగాణ బడ్జెట్, గవర్నర్ ప్రసంగం: ప్రభుత్వ ఉత్తర్వులు
తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ అయింది. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి శాసనసభ, మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉభయసభలను ఉద్దేశించి శుక్రవారం మధ్యాహ్నం 12:10 గంటలకు గవర్నర్ తమిళి
హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ అయింది. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి శాసనసభ, మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉభయసభలను ఉద్దేశించి శుక్రవారం మధ్యాహ్నం 12:10 గంటలకు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ అసెంబ్లీలో ప్రసంగించనున్నారు. అయితే గత సమావేశాల కొనసాగింపుగానే నోటిఫికేషన్ జారీ అయింది.
కాగా, శాసన మండలి, అసెంబ్లీ సంయుక్త సమావేశానికి గవర్నర్ అనుమతి ఇచ్చారు. 3న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగిస్తారు. కొత్త సమావేశాలుగా కాకుండా గత సమావేశాలకు కొనసాగింపుగానే ఈమారు కూడా ఉభయసభలు సమావేశం కానున్నాయి. ప్రోరోగ్ చేయకుండానే తాజాగా సమనింగ్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఎనిమిదో సెషన్కు సంబంధించిన నాలుగో విడతగా అసెంబ్లీ సమావేశం కానుంది.
18వ సెషన్కు సంబంధించిన నాలుగో విడతగా కౌన్సిల్ సమావేశం కానుంది. ఫిబ్రవరి 6వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే సీఎం కేసీఆర్ మంత్రులు హరీవ్ రావు, ప్రశాంత్ రెడ్డి, ఉన్నతాధికారులతో సమాలోచనలు జరిపారు.
అంతకుముందు, సోమవారం రోజున హై కోర్టు సూచనలతో రాష్ట్ర ప్రభుత్వం, రాజ్భవన్ న్యాయవాదుల మధ్య రాజీ కుదిరిన విషయం తెలిసిందే. తమకు ఎలాంటి దురుద్దేశాలు లేవని రాజ్భవన్ న్యాయవాది పేర్కొనగా.. సంయుక్త సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రభుత్వం తరపు న్యాయవాది చెప్పారు. దీంతో ఇరుపక్షాల మధ్య అపోహలు తొలగిపోయాయి.
అయితే, ప్రభుత్వం గవర్నర్ కార్యాలయానికి కనీస గౌరవం ఇవ్వడం లేదని గవర్నర్ తరఫు సీనియర్ న్యాయవాది అశోక్ ఆనంద్ కుమార్ కోర్టుకు తెలిపారు. ఒక ఎమ్మెల్యే చాలా అనుచితంగా వ్యాఖ్యలు చేశారని వివరించారు. ప్రభుత్వం రాసిన లేఖపై స్పందించామని, దీనిపై వివరణ కోరితే ఎలాంటి సమాధానం ఇవ్వలేదన్నారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా సంప్రదాయబద్ధంగా గవర్నర్ ప్రసంగం ఉంటుందా లేదా అని అడిగితే సమాధానం లేదన్నారు. దీనిపై ప్రభుత్వ సీనియర్ న్యాయవాది జోక్యం చేసుకుంటూ గవర్నర్ అని కాకపోయినా కనీసం మహిళగా పరిగణించి అయినా ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయకుండా చూడాలని కోరారు. ప్రభుత్వానికి దీనిపై తెలియజేస్తామని చెప్పారు.