శ్రీలంకలో రూ.5 లక్షలు పంచిన తెలంగాణ వాసి-పోలీసుల నిర్బంధం-భారత్ జోక్యంతో విముక్తి
శ్రీలంక ఆర్ధిక సంక్షోభంతో విలవిల్లాడుతున్న నేపథ్యంలో అక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్ధానికులపై ప్రపంచ దేశాలు సానుభూతి చూపుతున్నాయి. ఇప్పటికే భారత్ నుంచి ఆహార వస్తువులతో పాటు చమురు కూడా శ్రీలంకకు వెళ్తోంది. ఇదే క్రమంలో తెలంగాణకు చెందిన ఓ వ్యాపారి శ్రీలంకలో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు కరెన్సీ నోట్లు పంచారు. దీంతో శ్రీలంక పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ లో ఈ ఘటన జరిగింది.
శ్రీలంక స్ధానికులకు నగదు, ఆహార పదార్ధాలు పంపిణీ చేశారనే ఆరోపణలతో తెలంగాణ వ్యాపారి రవీందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీలంక పోలీస్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సిఐడి) విచారణ కోసం తీసుకువెళ్లిన కొన్ని గంటల్లోనే అక్కడి భారత హైకమిషన్ జోక్యం కారణంగా తనను విడిచిపెట్టినట్లు రవీందర్ రెడ్డి తెలిపారు.
ప్రతి నెల తాను శ్రీలంక వెళ్తానని, గత నాలుగైదు నెలలుగా రెగ్యులర్గా వెళ్తున్నట్లు రవీందర్ రెడ్డి తెలిపారు.నేను 9-21 రోజులు అక్కడే ఉంటానని, లంకలో నిరసనలు వెల్లువెత్తుతున్న సమయంలో అక్కడే ఉండి స్ధానికులకు ఆహారం డబ్బు పంపిణీ చేసినట్లు రవీందర్ రెడ్డి వెల్లడించారు. ద్వీపం దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం మధ్య ద్రవ్యోల్బణం, ఇంధనం, ఆహారం, ఔషధాల వంటి నిత్యావసర వస్తువుల కొరత వెంాడుతోంది. దింతో శ్రీలంక ప్రజలకు సహాయం చేయడానికి తాను వీటిని పంపిణీ చేసినట్లు రవీందర్ రెడ్డి వెల్లడించారు. ఈ పర్యటనలో తాను భారతీయ కరెన్సీలో రూ. 5 లక్షల విలువైన డబ్బును - 500 మరియు 1,000 డినామినేషన్ల శ్రీలంక నోట్లలో పంపిణీ చేశానని వ్యాపారవేత్త రవీందర్ రెడ్డి పేర్కొన్నారు.
శ్రీలంక పోలీసులు రవీందర్ రెడ్డిని తాము అరెస్టు చేయలేదని, కేవలం ప్రశ్నించేందుకు మాత్రమే అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు. భారత హైకమిషన్ జోక్యంతో ఎట్టకేలకు రవీందర్ రెడ్డి విడుదలై స్వదేశానికి చేరుకున్నారు. దీంతో ఈ ఘటన ఇప్పుడు దేశంలో చర్చనీయాంశమైంది.