వరి ధాన్యం కొనుగోళ్లు - ఓమిక్రాన్ చర్యలు : ఆర్టీసీ-విద్యుత్ ఛార్జీలు..నేడే తెలంగాణ కేబినెట్..!!
పలు కీలక అంశాల పైన నిర్ణయాలే అజెండాగా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం క్యాంపు కార్యాలయం ప్రగతిభవన్లో రాష్ట్ర కేబినెట్ భేటీ జరగనుంది. ధాన్యం కొనుగోళ్లు, యాసంగి పంటల సాగుతో పాటుగా... ప్రస్తుతం ప్రపంచ దేశాలకు సవాల్ గా మారుతున్న ఓమిక్రాన్ వైరస్ అంశం పైన కేబినెట్ లో చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇదే సమయంలో కొంత కాలంగా పెండింగ్ లో ఉంచిన ఆర్టీసీ..విద్యుత్ ఛార్జీల పెంపు పైన ఈ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.
వరి ధాన్యం కొనుగోళ్లపై చర్చ
కొంతకాలంగా వరి ధాన్యం కొనుగోళ్లపై ఉన్న అనిశ్చితి పరిస్థితి, రైతాంగం సమస్యలు, యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలపై చర్చించనున్నారు. ఈ మేరకు సీఎస్ సోమేష్ కుమార్ నిన్న అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విత్తన కంపెనీలు, మిల్లర్లతో ఒప్పందాలు చేసుకునే వారు సొంత రిస్క్తో వరిసాగు చేసుకోవచ్చని సోమేశ్ కుమార్ పేర్కొన్నారు. వానాకాలం ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జరిగేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్న సీఎస్.. అవసరమైన చోట కొత్త కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీనిపై మంత్రి మండలి సమావేశంలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశముంది.
ఆర్టీసీ..విద్యుత్ ఛార్జీల పెంపు పైనా
అలాగే, ఆర్టీసీ ఛార్జీల పెంపు, విద్యుత్ ఛార్జీలపై రాష్ట్ర కేబినెట్ కీలకంగా చర్చించనుంది. ఇటీవలే ఢిల్లీకి వెళ్లి వచ్చిన తెలంగాణ సీఎం కేసీఆర్.. పర్యటన పరిణామాలను కూడా వివరించే అవకాశం ఉంది. ఇదే సమయంలో ఎంపీలతో జరిగిన సమావేశం.. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాల పైన ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంపీలకు దిశా నిర్దేశం చేసారు. ఇక, ఈ కేబినెట్ లో రాష్ట్రంలో కరోనా పరిస్థితుల పైనా చర్చించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతున్న వేళ ఓమిక్రాన్ అనే మరో కొత్త వేరియంట్ కలవరం సృష్టిస్తోంది.
ఓమ్రికాన్ తో అప్రమత్త చర్యలు
గతంలో వచ్చిన వేరియంట్ల కంటే ఇది చాలా ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే ప్రకటించింది. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్పై ప్రపంచ దేశాలు అప్రమత్తం అయ్యాయి. ముఖ్యంగా ధక్షిణాఫ్రికా, నమీబియా, బోట్స్ వానా, జాంబియా, లెసాతో, జింబాబ్వే దేశాలకు వెళ్లొద్దని తమ పౌరులకు హెచ్చరికలు జారీచేశాయి. మరోవైపు ఓమిక్రాన్ వేరియంట్పై భారత ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. దాని వ్యాప్తిని నివారించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటోంది.
Recommended Video
పొరుగు రాష్ట్రాల సరిహద్దుల్లో ఎలా వ్యవహరించాలి
తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఓమిక్రాన్పై అలర్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి అయా రాష్ట్రాలకు కీలక ఆదేశాలు అందాయి. ఇప్పటికే శంషాబాద్ విమానాశ్రయం లో ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఇక, మహారాష్ట్ర..కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాలు సరిహద్దుల వద్ద ఆంక్షలు విధించాయి. తెలంగాణ ప్రభుత్వం వాటి పైన చర్చించి... నిర్ణయాలు తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే రాజ్యసభలో ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం వివక్ష పైన చర్చకు డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ రాజ్యసభ ఫ్లోర్ లీడర్ కేశవ రావు నోటీసులు ఇచ్చారు.