తెలంగాణలో కొత్త తెల్ల రేషన్ కార్డులకు అర్హతలివే!
తెలంగాణలో అర్హులందరికీ రేషన్ కార్డులు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు ముమ్మరం చేసింది. రాష్ట్రంలో నూతన తెల్ల రేషన్ కార్డులు పొందేందుకు అర్హతలపై మంత్రివర్గ ఉపసంఘం చర్చించింది. కేబినెట్ సబ్ కమిటీ ఛైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సభ్యులు దామోదర రాజనర్సింహా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమావేశమై రేషన్ కార్డుల జారీకి అర్హతలు, విధివిధానాలపై కసరత్తు చేశారు.
ఇప్పటికే ఉన్న వారితో పాటు, అర్హులకు కొత్తగా తెల్లరేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెల్లరేషన్ కార్డుల జారీకి గరిష్ఠ వార్షికాదాయం, భూమి పరిమితిపై పౌర సరఫరాల శాఖ ప్రతిపాదనలపై కేబినెట్ సబ్ కమిటీ చర్చించింది. గ్రామాల్లో రూ.లక్షన్నర, పట్టణాల్లో రూ.2 లక్షల గరిష్ఠ వార్షికాదాయంగా ప్రతిపాదించింది. గ్రామాల్లో మూడున్నర ఎకరాల మాగాణి, ఏడున్నర ఎకరాల చెలకగా గరిష్ట భూపరిమితిగా ప్రతిపాదించిన పౌరసరఫరాల శాఖ.. పట్టణాల్లో భూమితో సంబంధం లేకుండా వార్షికాదాయన్ని మాత్రమే పరిగణనలో తీసుకోవాలని స్పష్టం చేసింది.

అర్హతలు, విధివిధానాలపై అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధుల సలహాలు తీసుకోవాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. రెండు రాష్ట్రాల్లో తెల్ల రేషన్ కార్డులు ఉన్న వారికి, ఏదో ఒక చోట ఉండేలా నిర్ణయించుకునేందుకు ఆప్షన్ ఇవ్వాలని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం నియమించిన సక్సేనా కమిటీ సిఫార్సులను పరిగణనలోకి తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో తెల్లరేషన్ కార్డుల జారీపై అధికారులు అధ్యయనం చేశామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 89 లక్షల 96 వేల రేషన్ కార్డులు ఉండగా, సుమారు పది లక్షల దరఖాస్తులు కొత్తగా వచ్చాయని మంత్రి చెప్పారు. అర్హతలు, విధివిధానాలపై సూచనలు స్వీకరించిన తర్వాత మరోసారి సమావేశమై ఖరారు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు ఇస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారెవరూ అవకాశం కోల్పోకుండా లోతైన అధ్యయనం చేస్తామని మంత్రి ఉత్తమ్ చెప్పారు.












Click it and Unblock the Notifications