పదేళ్లు నేనే.. నువ్వెలా వస్తావో చూస్తా: రేవంత్ రెడ్డి
నిరుద్యోగులెవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని, వారి సమస్యలను పరిష్కరిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. కొత్తగా ఎంపికైన కానిస్టేబుల్ అభ్యర్థులకు లాల్ బహుదూర్ స్టేడియంలో ఆయన నియామక పత్రాలు అందజేశారు. రాష్ట్రం కోసం పోరాడిన యువత ఉద్యోగాలు సాధించడం సంతోషంగా ఉందని, యువతను ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నుంచి గట్టెక్కిస్తామన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత కష్టాలు తీరతాయని నిరుద్యోగులంతా ఆశించారని, అయితే తొమ్మిదిన్నర సంవత్సరాలపాటు గత ప్రభుత్వానికి ఆ ఆలోచనే రాలేదని మండిపడ్డారు. నియామక పత్రాలు ఇంటికే పంపించవచ్చుకదా అని హరీశ్ రావు అంటున్నారని, కానీ యువత కళ్లల్లో ఆనందం చూడటానికి, దాన్ని పంచుకోవడానికే ఇలాంటి వేదికను ఏర్పాటు చేశామన్నారు. కుటుంబ సభ్యులకే కేసీఆర్ పదవులిచ్చారని, యువత ఏం పాపం చేసిందని ఉద్యోగాలు ఇవ్వలేదని ప్రశ్నించారు.

పాలిచ్చే బర్రెను ఇంటికి పంపించి దున్నపోతును తెచ్చుకున్నారంటూ కేసీఆర్ నల్గొండ సభలో అన్నారని, కానీ కంచర గాడిదను ఇంటికి పంపించి రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారని అసెంబ్లీలోని ఓ అటెండర్ తనకు చెప్పారన్నారు. నీటి వాటాలపై ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేసిన సంతకాలు తెలంగాణ ప్రజలకు మరణ శాసనాలుగా మారాయని, ఢిల్లీలో పోరాడదామని అంటుంటే ఇంటినుంచి బయటకు రావడంలేదన్నారు. యువత కోసం పనిచేయడానికి, వారి సమస్యలు పరిష్కరించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
24 గంటలు కష్టపడి పనిచేస్తానని, ప్రజలు ఆశీర్వదిస్తే మరో పది సంవత్సరాలు ఇందిరమ్మ రాజ్యం ఉంటుందని, తామే మళ్లీ అధికారంలోకి వస్తామని కేసీఆర్ అంటున్నారని, ఎలా వస్తారో నేనూ చూస్తానని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ శాంతికుమారి, మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications