2006 కేసు: సిఎం కెసిఆర్ను గంటకుపైగా ప్రశ్నించిన సిబిఐ బృందం
హైదరాబాద్: 2006 కేసుకు సంబంధించిన విచారణలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావును సోమవారం ప్రత్యేక సిబిఐ అధికారుల బృందం ప్రశ్నించింది. ఆయన నివాసానికి వెళ్లిన సిబిఐ అధికారులు గంటకు పైగా కేసీఆర్ ను ప్రశ్నించినట్టు తెలుస్తోంది.
కాగా, 2006లో కెసిఆర్ కేంద్ర కార్మిక, ఉపాధి శాఖల మంత్రిగా ఉన్న సమయంలో, పలు రాష్ట్రాల్లో ఈఎస్ఐ భవనాలను నిర్మించే కాంట్రాక్టులను నేషనల్ బిల్డింగ్ కన్ స్ట్రక్షన్ కార్పొరేషన్ (ఎన్బిసిసి)కి తొలుత ఇవ్వగా, దాన్ని రద్దు చేసి, ఏపీ ఫిషరీస్ విభాగంలో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీరుకు ఇప్పించారన్నది కేసీఆర్పై వచ్చిన ప్రధాన ఆరోపణ.

సదరు కాంట్రాక్టర్ నాసిరకం నిర్మాణాలు చేపట్టడంతో 2007-08లో ఈఎస్ఐ కార్పొరేషన్ విచారణకు ఆదేశించింది. 2011లో కేసు నమోదు చేసిన సిబిఐ అవినీతి వ్యతిరేక విభాగం, ఈ కేసులో కనీసం రూ. 5 కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైనట్టు పసిగట్టింది.
కేసుపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో ఏపీ ఫిషరీస్, ఇంజనీరింగ్ విభాగంలోని ఎగ్జిక్యూటివ్ సత్యనారాయణను తొలి ముద్దాయిగా సిబిఐ పేర్కొంది. కేసులో భాగంగా ఇప్పటివరకూ కేసీఆర్ ప్రైవేటు కార్యదర్శిని విచారించిన తరువాత ఆయన్ను కూడా ప్రశ్నించాలని భావించిన సిబిఐ కెసిఆర్ ఇంటికి వచ్చినట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications