మోడీపైకి కెసిఆర్ మరో గుదిబండను నెట్టారు: ఏమిటది?
హైదరాబాద్: వచ్చే ఎన్నికల కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు వ్యూహాలను రూపొందించి అమలు చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. వివిధ సామాజిక వర్గాలను తన వైపు తిప్పుకోవడానికి ఎత్తుల మీద ఎత్తులు వేస్తున్నారు.
తాజాగా బిసీలను తన వైపు తిప్పుకోవడానికి మరో పాచికను విసిరారు. దాన్ని నేరుగా ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వానికి గురి పెట్టారు. బీసిలకు చట్టసభలో రిజర్వేషన్లు కల్పించాలని ప్రతిపాదించి, కేంద్రంపైకి నెట్టేందుకు సిద్ధపడ్డారు.
పార్లమెంటులో చట్టం చేయాలని...
చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంట్లో చట్టం తీసుకు రావాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపించడానికి కెసిఆర్ సిద్దపడ్డారు.. ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర పక్షాన కేంద్రానికి విజ్ఞప్తి చేయనున్నట్టు ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంగా ఆవిర్భవించిన తొలినాళ్లలోనే చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కావాలని శాసనసభలో తీర్మానం చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
ఇప్పటికే ముస్లిం కోటా..
విద్య, ఉద్యోగాల్లో ముస్లింలకు 12 శాతం కోటా కల్పిస్తూ శాసనసభలో బిల్లు ఆమోదించిన కెసిఆర్ ప్రభుత్వం, దాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని కేంద్రాన్ని కోరింది. తాను ఇచ్చిన హామీ మేరకు ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించామని, ఇక దాన్ని అమలు చేయించాల్సిన బాధ్యత కేంద్రానిదేనని ఆయన స్పష్టంగానే చెప్పినట్లయింది. ఇప్పుడు చట్టసభల్లో బీసీ కోటా గురించి కేంద్రాన్ని ఇరకాటంలో పెట్ట ప్రయత్నం చేస్తున్నారు.
ప్రధాని వద్దకు అఖిల పక్షం..
చట్టసభల్లో బీసీలకు కోటా కల్పించాలని కోరడానికి రాష్ట్రం తరఫున అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధానమంత్రిని కలిసి ఒత్తిడి తెస్తామని కెసిఆర్ తెలిపారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వంలో బీసీ సంక్షేమశాఖను ఏర్పాటు చేయవలసిన అవసరం ఉన్నదని కూడా ఆయన అన్నారు. పదోన్నతుల్లో కూడా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రాన్ని కోరనున్నట్లు మరో డిమాండ్ను తెరపైకి తెచ్చారు.
బీసీల కోసం సమావేశం...
బీసీల సంక్షేమం-అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి ఆదివారం అసెంబ్లీ కమిటీహాలులో జరిగిన బీసీ వర్గాలకు చెందిన ప్రజాప్రతినిధుల సమావేశంలో కెసిఆర్ పాల్గొన్నారు. బీసీల కోసం తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఆయన వివరించారు.
ఎంబీసీలు, సంచార జాతులను కూడా పైకి తీసుకు రావాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.
బిసీలపై స్పీకర్కు విజ్ఞప్తి
బీసీల అభ్యున్నతికి తీసుకోవాల్సిన చర్యలపై, చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించేందుకు శానససభలో రోజంతా కేటాయించాలని కెసిఆర్ స్పీకర్ మధుసూదనాచారిని కోరారు. బీసీ ప్రజా ప్రతినిధులు మూడు, నాలుగు రోజులు చర్చించిన తర్వాత ప్రభుత్వానికి సూచనలు చేస్తారని, వాటిపై తీసుకోవాల్సిన చర్యలపై అసెంబ్లీలో చర్చ జరుగుతుందని ఆయన అన్నారు. అవససమైన బిల్లులను, జీవోలను చేయడానికి, రూపొందించడానికి వీలు కలుగుుందని చెప్పారు.