మోడీతో కేసీఆర్కు డైరెక్ట్ లైన్: ఏకిపారేసిన రాహుల్, హైదరాబాద్లో ‘భారత్ జోడో’ జోష్
హైదరాబాద్: బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ రెండు పార్టీలు కలిసే పనిచేస్తున్నాయన్నారు. ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్నాయని మండిపడ్డారు. మంగళవారం భారత్ జోడో యాత్రలో బఆగంగా నెక్లెస్రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద కార్నర్ మీటింగ్లో పాల్గొని మాట్లాడారు.
మోడీతో కేసీఆర్కు డైరెక్ట్ ఫోన్ లింక్: రాహుల్ గాంధీ
బీజేపీని పార్లమెంటులో టీఆర్ఎస్ ఎన్నోసార్లు సమర్థించిందని రాహుల్ ఆరోపించారు. ఎన్నికలు వచ్చినప్పుడే ఈ రెండు పార్టీలు విమర్శలు చేసుకున్నట్లు నాటకాలాడుతాయన్నారు. కేసీఆర్ ఫోన్ చేసిన మరుక్షణమే మోడీ స్పందిస్తారని.. కేసీఆర్కు మోడీతో డైరెక్ట్ ఫోన్ లింక్ ఉందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ రెండు ప్రభుత్వాలు కూడా రైతులకు అండగా నిలబడలేదని మండిపడ్డారు.
మోడీ, కేసీఆర్ను ఏకిపారేసిన రాహుల్ గాంధీ
దేశంలో యువతకు ఉద్యోగాలు లభించట్లేదని, ఇంజినీరింగ్ చేసిన వాళ్లు స్విగ్గీలో పనిచేస్తున్నారని రాహుల్ తెలిపారు. ఎయిర్ పోర్టులు, ఎల్ఐసీ, టెలికాం వంటి ప్రభుత్వ రంగ సంస్థలను మోడీ ప్రభుత్వం కారుచౌకగా అమ్మేస్తోందని రాహుల్ ఆరోపించారు. నోట్ల రద్దు వల్ల చిన్న వ్యాపారులు నష్టపోయారన్నారు. సీఎం కేసీఆర్ దృష్టి ఎప్పుడూ ధరణి పోర్టల్ మీదే ఉంటుందని.. భూములు ఎక్కడున్నా ఆక్రమించడానికి చూస్తారని రాహుల్ గాంధీ విమర్శించారు.
కేసీఆర్కు ప్రజలే బుద్ధి చెబుతారన్న మల్లిఖార్జున ఖర్గే
మల్లిఖార్జున ఖర్గే మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు. ఈ రెండు ప్రభుత్వాలు అవినీతికి పాల్పడుతున్నాయన్నారు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వడం వల్లే కేసీఆర్ సీఎం అయ్యారని తెలిపారు. కేసీఆర్కు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 55 రోజులుగా రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారన్నారు.
శాంతియుతంగా కొనసాగుతోందన్నారు. చార్మినార్ ప్రాంతంలో దిక్కులు పెక్కటిల్లేలా లక్షలాది మంది రాహుల్ గాంధీకి స్వాగతం పలికారని చెప్పారు. మల్లిఖార్జున ఖర్గే ఏఐసీసీ అధ్యక్షుడి హోదాలో మొదటిసారి హైదరాబాద్ వచ్చారని, వారికి అఖండమైన స్వాగతం పలికామన్నారు.
చార్మినార్ వద్ద జాతీయ జెండా ఎగురవేసిన రాహుల్
అంతకుముందు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు హైదరాబాద్ నగరంలో ఘన స్వాగతం లభించింది. ఎంజే మార్కెట్, గాంధీ భవన్ వద్దకు రాగానే పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వాగతం పలికారు. ఆ తర్వాత చార్మినార్ వద్దకు చేరుకున్న రాహుల్ గాంధీ.. అక్కడ జాతీయ పతాకం ఎగరవేశారు. అనంతరం పురానాపూల్ వంతెన మీదుగా యాత్ర కొనసాగించారు. రాహుల్ వెంట కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. రాహుల్ యాత్రకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేరారు. సుమారు వెయ్యి మందికిపైగా పోలీసులు భద్రత కల్పించారు. యాత్ర మార్గంలో ట్రాఫిక్ మళ్లించారు.
రాహుల్ను కలిసిన రోహిత్ వేముల తల్లి
యాత్ర సందర్బంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థి రోహిత్ వేముల తల్లి రాధిక వేముల రాహుల్ ని కలిసి రాహుల్కు సంఘీభావాన్ని ప్రకటించారు. రోహిత్ వేముల ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆయన ఆత్మహత్య దేశవ్యాప్తంగా కలకం రేపింది. ఆ సమయంలో రాహుల్ గాంధీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి కూడా వచ్చారు. తాజాగా, తనను కలిసిన రోహిత్ తల్లిని రాహుల్ ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు. రాహుల్ తో కలిసి రాధిక పాదయాత్రలో నడిచారు. బీజేపీ, ఆరెస్సెస్ నుంచి మన రాజ్యాంగాన్ని రక్షించాలని ఈ సందర్భంగా రాహుల్ను ఆమె కోరారు. మీకు పూర్తి న్యాయం చేస్తానని ఈ సందర్భంగా ఆమెకు రాహుల్ హామీ ఇచ్చారు. కాగా, రాహుల్ తో రోహిత్ తల్లి కలిసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.