ఈటలను సాగనంపేందుకు ముహూర్తం ఫిక్స్.. ఈ రాత్రికే రాజీనామా..? భగ్గుమంటున్న మంత్రి అభిమానులు...
మంత్రి ఈటల రాజేందర్పై భూకబ్జా ఆరోపణలు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద కుదుపు అనే చెప్పాలి. రాజేందర్ను సాగనంపేందుకు ప్రీప్లాన్డ్గా ఈ వ్యవహారం సాగిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి ఈటల కూడా ఇదంతా పక్కా స్కెచ్ అని మీడియా ముఖంగానే ఆరోపించారు. కనీసం ముఖ్యమంత్రి తనతో ఒక్క మాట కూడా మాట్లాడకుండానే విచారణకు ఆదేశించడం బాధ కలిగించిందన్నారు.
మూడు రోజులుగా ఫోన్ ద్వారా సీఎం కేసీఆర్,మంత్రి కేటీఆర్లను సంప్రదించే ప్రయత్నం చేస్తున్నా ఇప్పటివరకూ అందుబాటులోకి రాలేదన్నారు. ఇదంతా చూస్తుంటే మంత్రి ఈటలకు ఉద్వాసన పలకడం ఖాయంగానే కనిపిస్తోంది. ఈ రాత్రికే ఈటలను మంత్రివర్గం నుంచి తప్పించనున్నట్లు లీకులు వస్తున్నాయి.
కేసీఆర్ ఫిక్స్...?
ఇప్పటికే మంత్రి ఈటల శాఖను ముఖ్యమంత్రి కేసీఆర్కు బదిలీ చేస్తూ గవర్నర్ తమిళిసై ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఈటల ఏ శాఖ లేని మంత్రిగా ఉండనున్నారు. మరోవైపు ఈటల భూకబ్జాలపై రెవెన్యూ,విజిలెన్స్ నివేదికలు కూడా ఈ సాయంత్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్కు చేరే అవకాశం కనిపిస్తోంది. జిల్లా కలెక్టర్ హరీశ్,అడిషనల్ కలెక్టర్ నగేశ్ ఇప్పటికే ఈటలపై భూకబ్జా ఆరోపణలను ధ్రువీకరించారు. తాజాగా సీఎంకు పంపించే నివేదికలోనూ దాదాపుగా ఇదే విషయాన్ని రూఢీ చేయనున్నారు. ఈటలను సాగనంపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ముందే ఫిక్స్ అయ్యారు కాబట్టే ఇవన్నీ చకచకా జరిగిపోతున్నాయన్న వాదన వినిపిస్తోంది.
ఈ రాత్రికే రాజీనామా...?
ఈ రాత్రికి నివేదిక అందిన వెంటనే మంత్రి ఈటలను మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించే అవకాశం ఉన్నట్లు లీకులు వస్తున్నాయి. అటు ఈటల కూడా ఆత్మాభిమానం కంటే తనకు పదవులు ఎక్కువ కాదని ఇప్పటికే ప్రకటించారు. ఇప్పటికే తన శాఖను కూడా ఎలాగు లాగేసుకున్నారు కాబట్టి... పైనుంచి ఆదేశాలు వచ్చేవరకూ ఈటల ఎదురుచూడకపోవచ్చు. తనకు తానుగా ఈ సాయంత్రం వరకే ఆయన రాజీనామా సమర్పించే అవకాశం కూడా లేకపోలేదు. ఇప్పుడున్న పరిస్థితులను గమనిస్తే ఈటల విషయంలో కేసీఆర్ వెనక్కి తగ్గడం అసంభవమనే అనిపిస్తోంది. ఆ ఉద్దేశంతోనే ఈటలతో మాట్లాడేందుకు కూడా ఆయన సుముఖంగా లేరని తెలుస్తోంది.
Recommended Video
భగ్గుమంటున్న అభిమానులు...
ఉద్యమం నాటి నుంచి ఇప్పటివరకూ కేసీఆర్ కుడిభుజంగా... టీఆర్ఎస్లో కేసీఆర్ తర్వాత ఆ స్థాయి నేతగా ఈటల రాజేందర్కు మంచి గుర్తింపు ఉన్నది. బీసీ నేపథ్యం,కింది స్థాయి నుంచి ఎదిగిన నేత కావడం,ఆయన నిరాడంబరత ఈటలకు జనంలో మంచి ఫాలోయింగ్ని సంపాదించి పెట్టాయి. ఈటల వ్యవహారంపై వస్తున్న రియాక్షన్స్ గమనిస్తే సోషల్ మీడియాలో ఎక్కువమంది ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. 'వి స్టాండ్ విత్ ఈటల' అంటూ తమ మద్దతు తెలుపుతున్నారు. ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి,మల్లారెడ్డి,పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితర నేతలపై భూకబ్జా ఆరోపణలున్నా చూసీ చూడనట్లు వ్యవహరించే కేసీఆర్... ఈటల బీసీ కాబట్టే ఆయన్ను టార్గెట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఈటలను పార్టీ నుంచి సాగనంపితే అది టీఆర్ఎస్కే నష్టమని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈటల భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుందన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.