ఒక తప్పు... జీవితకాలం వెంటాడుతుంది?
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు రాజకీయాల్లో గండర గండడుగా పేరు తెచ్చుకున్నారు. ఆయన వ్యూహాలు ప్రత్యర్థులకు అంతుపట్టకుండా ఉంటాయి. దీంతో వ్యూహాత్మక రాజకీయాలకు ప్రసిద్ధిగా పేరు తెచ్చుకున్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత 63 సీట్లు సాధించి రాష్ట్రంలో అధికారం చేపట్టారు. ఆ తర్వాతే ఆయన తనలోని రాజకీయ చతురతను, వ్యూహాలను బయటకు తీశారు. ఈక్రమంలో ఆయన చేసిన తప్పు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితిని వెంటాడుతోంది. అధికారం ఉంటుందా? లేదా? అనే సందిగ్ధతలో టీఆర్ఎస్ ఉంది.

ప్రభుత్వం స్థిరంగా ఉండాలని..
తెలంగాణలో మొత్తం 119 స్థానాలున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 60 సీట్లు గెలుపొందాలి. అంతకన్నా ఎక్కువగా మూడు స్థానాలను ఉద్యమ పార్టీ గెలుచుకోగలిగింది. దీనివల్ల ప్రభుత్వం ఎప్పుడైనా భవిష్యత్తులో మైనారిటీలో పడే అవకాశం ఉందని గ్రహించిన కేసీఆర్ ముందుగా తెలుగుదేశం పార్టీపై దృష్టిసారించారు. రాష్ట్రం విడిపోయింది కాబట్టి టీడీపీకి ఇక్కడ భవిష్యత్తు లేదని గ్రహించిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోకి దూకేశారు. ఆ తర్వాత కాంగ్రెస్వైపు చూశారు. ఇలా ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి చేర్చుకొని ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకోగలిగారు.

టీడీపీ, కాంగ్రెస్ ను బలహీనపరిచి..
రెండోసారి అధికారం చేపట్టినప్పుడు తిరుగులేని మెజారిటీతో 88 స్థానాలను గెలుచుకోగలిగారు. కాలం గిర్రున తిరిగింది. ఈరోజు భారతీయ జనతాపార్టీతో హోరాహోరీగా తలపడాల్సిన పరిస్థితి ఎదురైంది. దీనికి కారణం రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలని అనుకోవడమే. బలమైన ప్రతిపక్షం ఉన్నప్పుడే అధికారంలో ఉన్న పార్టీ మరింత బాగా పనిచేయగలుగుతుందనే సూత్రాన్ని మాత్రం ఇక్కడ కేసీఆర్ మరిచిపోయారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలను బలహీనపరచడంవల్ల కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దృష్టి ఇప్పుడు తెలంగాణపై పడింది. దీంతో టీఆర్ఎస్ తీవ్ర ఉక్కపోతకు గురవుతోంది.

చతురంగ బలాలను మొహరించిన మోడీ, షా
కేంద్రంలో ఉన్న అధికార బలంతో ఈ రాష్ట్రాన్ని ఎలాగైనా చేజక్కించుకోవాలనే వ్యూహంతో మోడీ, అమిత్ షా ముందుకు సాగుతున్నారు. చతురంగ బలాలను మొహరించారు. టీడీపీ, కాంగ్రెస్ రెండూ ఉండివుంటే ఈ రెండూ ప్రధాన ప్రతిపక్షాలుగా ఉండేవి. ఈ రెండు పార్టీల్లో ఇప్పుడు బలమైన నాయకులు లేకపోవడవల్ల ప్రజలు ప్రత్యామ్నాయంగా బీజేపీవైపు చూస్తున్నారు.
కాంగ్రెస్ లో కొందరు ప్రధాన నేతలు ఉన్నప్పటికీ వీరిలో వీరే కలహించుకుంటూ వారంతటవారే పార్టీని బలహీనపరుస్తున్నారు. టీఆర్ఎస్ ను వ్యతిరేకించేవారికి బీజేపీ ఒక్కటే ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. కాలం ఎవరికోసం ఆగదు. ఈరోజు ఉన్న అధికారం రేపు ఉండకపోవచ్చు. కానీ మన పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలంటే ఏం చేయాలో అదేచేయాలి.
కానీ ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధంగా బలమైన ప్రతిపక్షాన్ని కూడా నిర్మించాలన్న సూత్రాన్ని విస్మరించడంతో బీజేపీతో యుద్ధం చేయడానికి, వారి వ్యూహాలను ఎదుర్కోవడానికి సర్వశక్తులను ధారపోయాల్సి వస్తోంది. భవిష్యత్తు ఏమిటనేది కాలమే నిర్ణయించనుంది.












Click it and Unblock the Notifications