ఈటల చుట్టూ: కొత్తగా మరో ఫిర్యాదు: సమగ్ర దర్యాప్తునకు కేసీఆర్ ఆదేశం
హైదరాబాద్: భూఆక్రమణ ఆరోపణలతో విచారణను ఎదుర్కొంటోన్న తెలంగాణ మాజీ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్పై మరో ఫిర్యాదు నమోదైంది. ఈ ఆరోపణలతో తన పదవికి రాజీనామా చేసి, ప్రభుత్వం నుంచి వైదొలగిన తరువాత కూడా ఫిర్యాదుల పరంపర కొనసాగుతూనే ఉంది. ఈటల కుమారుడు తన భూమి కబ్జా చేశారని, తనకు న్యాయం చేయాలని కోరుతూ బాధితుడు నేరుగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు లేఖ రాశారు. దీనిపై కేసీఆర్ స్పందించారు. సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ను ఆదేశించారు.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా రావల్కోల్ గ్రామానికి చెందిన పిట్ల మహేష్ ముదిరాజ్.. ఈటలపై ఫిర్యాదు చేశారు. రావల్కోల్లో తన తాత పేరు మీద ఉన్న భూమిని ఈటల కుమారుడు ఆక్రమించారని అన్నారు. 1954 నుంచి 1986 వరకు పహాణీల్లో తన తాత పేరు ఉందని, టెనెన్సీ, సీలింగ్ యాక్ట్ ప్రకారం.. సంబంధిత భూమికి తాము ఎన్నో ఏళ్ల నుంచి హక్కుదారులుగా ఉంటున్నామని అన్నారు. తన భూమిని ఆక్రమించిన వారు తనను బెదిరిస్తోన్నారని, ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకీడిస్తున్నామని కేసీఆర్కు పంపించిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

అదే కాపీని బాధితుడు మేడ్చల్ జిల్లా కలెక్టర్, కీసర ఆర్డీఓ, మేడ్చల్ ఎమ్మార్వో, సీఐకు పంపించారు. దీనిపై కేసీఆర్ వెంటనే స్పందించారు. సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. రావల్కోల్లో ఈటల కుమారుడి భూకబ్జా ఆరోపణలపై సమగ్ర నివేదికను అందజేయాలని సూచించారు. ఈ తాజా వ్యవహారం కాస్తా ఈటలను మరింత ఇబ్బందుల్లోకి నెట్టినట్టయింది. తనపై ప్రభుత్వం ఉద్దేశపూరకంగా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఈటల ఆరోపిస్తోన్నారు. ఆయన ఇదివరకే భూఆక్రమణ ఆరోపణలను ఎదుర్కొంటోన్నారు.
మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట్లల్లో భూ కబ్జా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ వ్యవహారంలో తెలంగాణలో హాట్ టాపిక్గా మారింది. భారతీయ జనతా పార్టీ లేదా కాంగ్రెస్లల్లో ఆయన చేరే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలొస్తోన్నప్పటికీ.. ఇప్పటిదాకా అది కార్యరూపం దాల్చలేదు. ఈటలకు మద్దతుగా ఇప్పటికే బీజేపీ నాయకులు గళం విప్పారు. నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కుమార్.. సహా కొందరు కాంగ్రెస్ నాయకులు సైతం ఈటలకు నైతిక మద్దతు ఇచ్చారు.












Click it and Unblock the Notifications