దేశాన్ని సాకుతున్నాం, కరీంనగర్ను లండన్ చేస్తా, ఓట్ల కోసమే రాజకీయం: కేసీఆర్
హైదరాబాద్: భారత దేశాన్ని సాకుతున్న ఏడు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అని సీఎం కేసీఆర్ మంగళవారం అన్నారు. శాసన సభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. మన దగ్గర నుంచి కేంద్రానికి రూ.50 వేల కోట్లు పోతే, రాష్ట్రానికి తిరిగి వచ్చేది రూ.24వేల కోట్లు మాత్రమే అన్నారు.
ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా ఉద్యోగులకు మెరుగైన జీతాలు ఇస్తున్నామని చెప్పారు. ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయన్నారు. ఉద్యోగుల పట్ల తాము సానుకూలంగా ఉన్నామని చెప్పారు.

రాష్ట్రంలో అవినీతిని పూర్తిగా అరికడతాని కేసీఆర్ చెప్పారు. గతంలో కాంట్రాక్టులు చేపడితే అవినీతి, ముందస్తు చెల్లింపులు జరిగేవన్నారు. కాంట్రాక్టుల విషయంలో మొబిలైజేషన్ అడ్వాన్సులు, ఈపీపీలు రద్దు చేశామన్నారు. పూర్తి పారదర్శకతతో ప్రాజెక్టుల పనులు సాగుతున్నాయన్నారు. నాణ్యత విషయంలో రాజీపడటం లేదన్నారు.
కరీంనగర్ను తప్పకుండా లండన్లా చేస్తామని చెప్పారు. మేము చెప్పనివి కూడా చెప్పినట్లు ప్రచారం చేయవద్దన్నారు. వరంగల్ను సింగపూర్లా చేస్తానని తాము చెప్పలేదన్నారు. లోయర్ మానేరు డ్యాం కింద 90 కిలో మీటర్ల సుందరీకరణ పనులు చేపడతామన్నారు. కరీంనగర్కు రూ.500 కోట్ల టూరిజం ప్యాకేజీ ఇచ్చామన్నారు.
ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకర్షిస్తాయని కేసీఆర్ చెప్పారు. అన్ని రాజకీయ పార్టీలు చేసేది అదే పని అన్నారు. ఓట్లు ఆకర్షించకపోతే రాజకీయ పార్టీ ఎందుకు అన్నారు. తెలంగాణ అంటే టీఆర్ఎస్కు టాస్క్ అన్నారు. ఇతర పార్టీలకు రాజకీయం అన్నారు.












Click it and Unblock the Notifications