మరో పురాతన ఆలయాన్ని అభివృద్ధి చేయనున్న కేసీఆర్: వరంగల్లో హరీశ్ రావు
తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీార్ నిజమైన హిందువని మంత్రి హరీశ్ రావు అన్నారు. రాష్ట్రంలోని పురాతన దేవాలయాల పునరుద్ధరణకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు.
వరంగల్: తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిజమైన హిందువని మంత్రి హరీశ్ రావు అన్నారు. రాష్ట్రంలోని పురాతన దేవాలయాల పునరుద్ధరణకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. వరంగల్ జిల్లా నర్సన్నపేట నియోజకవర్గం పర్వతగిరిలో నిర్వహిస్తున్న చారిత్రక పర్వతాల శివాలయం ప్రతిష్టాపన మహోత్సవంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి పాల్గొన్నారు హరీశ్ రావు.
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ..కొంతమంది హిందువులంటూ ప్రచారం చేసుకుంటారు కానీ.. కేసీఆర్ హిందూధర్మ ప్రచారకుడని అన్నారు. సీఎం కేసీఆర్ యాదాద్రి, కోటి లింగాల, వేములవాడ దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. శిశుడి ఆశీస్సులతో రాష్ట్రం అభివృద్ధి కావాలన్నారు. కేసీఆర్ కు శివుడి ఆశీస్సులు ఉండాలని కోరుతున్నానని చెప్పారు.
ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్న కల్లెడ రామ్మోహన్ రావు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు హరీశ్ రావు అభినందనలు తెలియజేశారు. 850 ఏళ్లనాటి జీర్ణావస్థలో ఉన్న శివాలయాన్ని పునర్ ప్రతిష్ట చేయడం గొప్ప విషయమని పేర్కొన్నారు. జీర్ణావస్థలో ఉన్న ఒక్క దేవాలయం పునర్ ప్రతిష్ట చేయడం అంటే వంద కొత్త ఆలయాలను నిర్మించడంతో సమానమన్నారు. పర్వతగిరి ప్రాంతం పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఈ ఆలయం గురించి సీఎం కేసీఆర్ కు వివరిస్తామని చెప్పారు.
కాకతీయులు కట్టిన శివాలయాలు జిల్లాలో చాలా ఉన్నాయని వాటిని కూడా అభివృద్ధి చేయాలని కోరారు మంత్రి దయాకర్ రావు. ఇప్పటికే సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని పలు ఆలయాలకు పూర్వ వైభవం తీసుకువచ్చారని, రామప్ప, లక్నవరం, వెయ్యి స్తంభాల గుడిని అభివృద్ధి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు గాయత్రి రవి, పసునూరి దయాకర్,ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యేలు ఆరూరి రమేశ్, నన్నపనేని నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ ఆస్పత్రి దేశానికే మోడల్గా నిలుస్తుంది: హరీశ్ రావు
వరంగల్లో 216 ఎకరాల్లో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి దేశానికే మోడల్గా నిలుస్తుందని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. పేద ప్రజలకు కార్పొరేట్ వైద్య సేవలు అందించాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. శనివారం ఆస్పత్రి నిర్మాణ పనులను మంత్రి హరీశ్ రావు పరిశీలించారు. డిసెంబర్ నెల వరకు ఆస్పత్రి అందిస్తామని ఏజెన్సీ తెలిపిందని.. అయితే, దసరా నాటికి ఆస్పత్రి పూర్తి చేసి ఇవ్వాలని కోరినట్లు మంత్రి తెలిపారు.