మీరేం చేస్తున్నారు, అప్పుడేం చేశారు: మంత్రులపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహం?
హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శుక్రవారం నాడు కేబినెట్ సమావేశంలో పలువురు మంత్రుల పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. వారి తీరు పైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం. ప్రతిపక్షాల విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వృద్ధి రేటు విషయంలో విపక్షాలు ప్రశ్నించినప్పుడు ఎందుకు తిప్పికొట్టలేదని కేసీఆర్ నిలదీశారని తెలుస్తోంది. అలాగే, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్సుమెంట్స్, రైతుల సమస్యల విషయంలో మంత్రుల పని తీరు ఆయనకు ఆగ్రహం తెప్పించిందని సమాచారం.
కాగా, కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగిన విషయం తెలిసిందే. సచివాలయంలో జరిగిన మంత్రివర్గ భేటీ నాలుగు గంటలపాటు కొనసాగింది.
బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై తదుపరి కార్యాచరణ, మహిళా ఉద్యోగులకు చైల్డ్కేర్ లీవ్స్, ఏపీ ప్రభుత్వానికి కేటాయించిన భవనాల అప్పగింత కోరుతూ గవర్నర్కు విజ్ఞప్తి, జిల్లాల పేర్లమార్పు, ప్రజల విజ్ఞప్తుల మేరకు పలు జిల్లాల్లో మార్పులు, చేర్పులు వంటి తదితర అంశాలపై మంత్రివర్గ సభ్యులు సమావేశంలో ప్రధానంగా చర్చించారు.
సమావేశంలో చర్చించి తీర్మానం తెలిపిన ప్రధాన అంశాలు..
- కృష్ణా నదీ జలాల పంపిణీపై బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ వెలువరించిన తీర్పును అధ్యయనం చేసేందుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. మంత్రి హరీశ్ రావు నేతృత్వంలో తుమ్మల నాగేశ్వర రావు, జగదీశ్వర్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పోచారం శ్రీనివాస్ రెడ్డిలు సభ్యులుగా, కడియం శ్రీహరి, నిరంజన్ రెడ్డిలు ప్రత్యేక ఆహ్వానితులుగా మంత్రివర్గ ఉపసంఘంలో ఉంటారు. ఈ మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం తదుపరి కార్యాచరణను ఖరారు చేయనుంది.
- భాషా పండితులు, పీఈటీల విజ్ఞప్తిపై చర్చించిన మంత్రివర్గం 2487 భాషా పండితులు, 1047 పీఈటీలను స్కూల్ అసిస్టెంట్స్గా అప్గ్రేడ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
- మహిళా ఉద్యోగులకు 90 రోజులు చైల్డ్ కేర్ లీవులు మంజూరు. పిల్లలకు 18 సంవత్సరాలు వచ్చే వరకు 90 రోజుల సెలవులు ఆరు దఫాలుగా ఎప్పుడైనా వాడుకోవచ్చు.
- ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన పరిపాలన భవనాలను తెలంగాణకు కేటాయించాలని గవర్నర్ను కోరుతూ తీర్మానం.
- ప్రజల అభీష్టం మేరకు ఆరు జిల్లాల పేర్లు మార్పు. కుమరం భీం ఆసిఫాబాద్, యాదాద్రిభువనగిరి, భద్రాద్రికొత్తగూడెం, జోగులాంబగద్వాల, రాజన్నసిరిసిల్ల, జయశంకర్భూపాలపల్లిగా పేర్లు మార్పు.
- విశ్వవిద్యాలయాల్లో విద్యాప్రమాణాలు పెంచేందుకు ఉప ముఖ్యమంత్రి కడియం నేతృత్వంలో కేబినెట్ సబ్కమిటీ ఏర్పాటుకు నిర్ణయం. మత్స్య సంపద, గొర్రెల పెంపకంపై మంత్రి తలసాని నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటుకు నిర్ణయం.