మనవడితో సీఎం రేవంత్ రెడ్డి హోళీ సంబరాలు
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా హోళీ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నా, పెద్దా తేడా లేకుండా అంతా రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా పండగను జరుపుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హైదరాబాద్లోని తన నివాసంలో మనవడు రేయాన్స్తో కలిసి హోళీ వేడుకల్లో పాల్గొన్నారు.
రేవంత్ సతీమణి గీతా రెడ్డి కూడా మనవడిపై రంగులు చల్లుతూ ఉత్సాహంగా కనిపించారు. తాత ఒళ్లో కూర్చుని రేయాన్స్ చిరునవ్వులు చిందుస్తూ హోళీ వేడుకలు జరుపుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను రేవంత్ రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. 'పరిపాలన, రాజకీయం, విజ్ఞప్తులు, పరిష్కారాలు, సమావేశాలు, తీరికలేని షెడ్యూల్ అన్నింటికీ కొంచెం విరామం. హోళీ నాడు.. మనవడితో ఆటవిడుపు' అని సీఎం వ్యాఖ్యానించారు.

హోళీ శుభకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్
సప్త వర్ణ రంగుల శోభను నింపాలి
రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ ఆప్యాయత సంతోషాల హరివిల్లుగా, శాంతి సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలిచే హోలీ రంగుల పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని అన్నారు. సహజ సిద్ధమైన రంగులతో సాంప్రదాయ పద్ధతులతో ఈ రంగుల పండుగను సంతోషంగా జరుపుకోవాలని అన్నారు.
కొత్త ప్రభుత్వం రాష్ట్రంలో అనుసరిస్తున్న ప్రజా పాలనలో అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి ఫలాలు అందరి కుటుంబాల్లో సప్త వర్ణ రంగుల శోభను నింపుతాయని అభిప్రాయపడ్డారు. కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజల సమైక్యతను చాటిచెప్పే ఈ పండుగ దేశమంతటా కొత్త మార్పుకు శ్రీకారం చుడుతుందని అన్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా త్వరలోనే దేశంలో అన్ని వర్గాలకు న్యాయం చేకూర్చే కొత్త ప్రజాస్వామ్య వాతావరణం వెల్లివిరిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు సీఎం రేవంత్.

ప్రజలందర్నీ చల్లగా చూడాలంటూ కేసీఆర్
నిత్య జీవనంలోని కష్టాలను కాసేపు మరిచి, వయోభేదం లేకుండా అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి కేరింతలతో ఆనందోత్సాహాల నడుమ రంగులతో జరుపుకునే ప్రకృతి పండుగ హోలీ అన్నారు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. హోలీ పండుగ భారతీయ సామాజిక సాంస్కృతిక జీవన ప్రత్యేకతను చాటుతుందని కేసీఆర్ అన్నారు. వసంతాన్ని తమ జీవితాల్లోకి ఆహ్వానిస్తూ జరుపుకునే హోలీ పర్వదిన సందర్భంగా ఆ ప్రకృతీమాత ప్రజలందరినీ చల్లగా చూడాలని కేసీఆర్ ప్రార్థించారు.












Click it and Unblock the Notifications