నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్, మంత్రుల భేటీ: హైదరాబాద్-విజయవాడ రహదారికి మహర్ధశ
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన మూడోరోజు కొనసాగుతోంది. ఈ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలతో పాటు పలువురు కేంద్రమంత్రులతో సమావేశమవుతున్నారు. బుధవారంనాడు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ సమావేశమయ్యారు.
సీఎం రేవంత్ వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుతో పాటు ఎమ్మెల్యే వివేక్ ఉన్నారు. రాష్ట్రానికి సంబంధించిన రోడ్ల విస్తరణ, కొత్త జాతీయ రహదారులు, నిధులు మంజూరు గురించి భేటీలో చర్చించారు.

రహదారుల సమస్యల పరిష్కారానికి కేంద్రమంత్రి గడ్కరీ సానుకూలంగా స్పందించారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్ - విజయవాడ రహదారిని ఆరు లేన్లలో నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. కేంద్రం నుంచి తెలంగాణకు రావాలసిన నిధులను సాధించడమే తమ లక్ష్యమని చెప్పారు.
జాతీయ రహదారులకు సంబంధించి గత ఐదేళ్లలో తెలంగాణకు అతి తక్కువ నిధులు వచ్చాయి. భూసమీకరణ, ఇతర అంశాలను అప్పటి రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. దీంతో పనులు ఆగిపోయాయి. 2016లో ప్రకటించిన రీజినల్ రింగ్ రోడ్డును మరిచిపోతే తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత కదలిక వచ్చిందని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. యుటిలిటీ ఛార్జీలను భరిస్తామన్నారు. కేంద్రమంత్రి గడ్కరీ స్పందించి తామే భరిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. 50-50 షేరింగ్ లో భూసమీకరణ ప్రారంభించాలని తాజా సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపారు.
రెండు తెలుగు రాష్ట్రాలకు ఉపయోకరమైన 6 లేన్ గురించి కూడా చర్చించామని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. రెండేళ్లలోపే విజయవాడ-హైదరాబాద్ మార్గాన్ని రూ. 4వేల కోట్ల బడ్జెట్ తో పూర్తి చేయనున్నామని, ఏపీ విభజన చట్టం ప్రకారం గ్రీన్ ఫీల్డ్ హైవేకు రూపకల్పన చేస్తున్నట్లు కేంద్రమంత్రి వెల్లడించారని కోమటిరెడ్డి తెలిపారు. అన్ని వినతులపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారన్నారు.












Click it and Unblock the Notifications