ఆయన పేరు తెరమీదకు రావడంతో వెనక్కి తగ్గిన నరేంద్ర మోడీ, అమిత్ షా?
అన్నివిధాలుగా అసమానతలు లేని సమాజాన్ని జాతిపిత మహాత్మాగాంధీ కోరుకున్నారని, కానీ ప్రస్తుత బీజేపీ పాలనలో అన్ని రంగాల్లో అసమానతలు పెరిగిపోతున్నాయని తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. దేశంలో విభజన, అశాంతి.. ఈ రెండు అంశాలు ప్రజలను ఎంతో ఆందోళనకు గురిచేస్తున్నాయన్నారు. ఆర్థిక అసమానతలు బాగా పెరిగాయని, గాంధీజీ ఆలోచనా విధానానికి వ్యతిరేకంగా ఎన్డీయే పాలన కొనసాగుతోందని మండిపడ్డారు.
రాజకీయాల్లో మతాన్ని చొప్పించి లబ్ధిపొందాలని బీజేపీ నేతలు ఎత్తుగడలు వేస్తున్నారని, అది దేశానికే ప్రమాదమని ఆందోళన వెలిబుచ్చారు. గాంధీజీ ఆలోచనలకు అనుగుణంగా ఉండాలనే ఉద్దేశంతోనే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేస్తున్నారన్నారు. త్వరలోనే హైదరాబాద్ నగరంలోని అన్ని బస్తీల్లో సీఎల్పీ పక్షాన పర్యటనలు చేయబోతున్నట్లు ప్రకటించారు.

ఏఐసీసీ అధ్యక్ష బరిలో కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే పోటీచేయడాన్ని తెలంగాణ సీఎల్పీ స్వాగతిస్తోందని భట్టి అన్నారు. బరిలో ఉన్న శశిథరూర్ తన నామినేషన్ వెనక్కి తీసుకొని ఖర్గేకి మద్దతు పలకాలని కోరారు. దేశంలోని కాంగ్రెస్ నేతలంతా ఖర్గేకు మద్దతు పలకాలన్నారు. అపార అనుభవం కలిగిన నాయకుడని, ఖర్గే పేరు తెరమీదకు రావడంతో బీజేపీ నేతలకు భయం పట్టుకుందని, ఆ పార్టీకి వంతపాడుతున్న మీడియా ద్వారా ఖర్గేపై విషపూరిత ప్రచారం చేస్తున్నారన్నారు. ఆయన్ను ఒకకులానికి, మతానికి పరిమితం చేయాలని బీజేపీ చూస్తోందని, మీడియా సంస్థలు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. కేసీఆర్ నూతన పార్టీ పెట్టిన తర్వాతే స్పందిస్తానన్నారు. విమానం కొనడమనేది ఆయన వ్యక్తిగత నిర్ణయమన్నారు.












Click it and Unblock the Notifications