అక్కడ పంతం నెగ్గించుకున్న మైనంపల్లి
హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly elections 2023) వేడి పతాక స్థాయికి చేరుకుంటోంది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణ వ్యాప్తంగా నవంబర్ 30వ తేదీన ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల కమిషన్. డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్ ఉంటుంది.
తాజాగా కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం తన అభ్యర్థుల తొలి జాబితా (Telangana Congress first list 2023)ను విడుదల చేసింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీనియర్ నేతలు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పీ సుదర్శన్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, గండ్ర సత్యనారాయణ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావతి రెడ్డి, సీతక్క, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. వంటి సీనియర్లు తొలి జాబితాలో ఉన్నారు.

ఇటీవలే బీఆర్ఎస్కు రాజీనామా చేసి, కాంగ్రెస్ పార్టీలో చేరిన మైనంపల్లి హన్మంతరావు తన పంతం నెగ్గించుకున్నారు. ఆయన కుటుంబానికి తెలంగాణ కాంగ్రెస్.. రెండు టికెట్లను కేటాయించింది. ఇదే డిమాండ్ను ఇదివరకు ఆయన బీఆర్ఎస్ చీఫ్, ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన కాదన్నారు.
దీనితో బీఆర్ఎస్కు గుడ్బై చెప్పారు మైనంపల్లి. కొద్దిరోజుల కిందటే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ అధినేత మల్లికార్జున ఖర్గే, రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. ఆయన పెట్టిన ప్రతిపాదనలను కాంగ్రెస్ అధిష్ఠానం అంగీకరించడమే దీనికి కారణం. తాజాగా విడుదల చేసిన తొలి జాబితాలోనే రెండు టికెట్లూ దక్కాయి ఆయనకు.
మైనంపల్లి హన్మంతరావు.. మల్కాజ్గిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. 2018 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి ఆయన ఘన విజయం సాధించారు బీఆర్ఎస్ అభ్యర్థిగా. ఇప్పుడు అక్కడి నుంచే కాంగ్రెస్ తరఫున బరిలో దిగనున్నారు. టికెట్ కూడా దక్కించుకున్నారు.
మైనంపల్లి హన్మంతరావు కుమారుడు రోహిత్ రావుకు సైతం టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మెదక్ అసెంబ్లీ స్థానం నుంచి రేసులో నిల్చున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ ఆధీనంలో ఉన్న నియోజకవర్గం ఇది. 2014, 2018 ఎన్నికల్లో ఇక్కడి నుంచి పద్మా దేవేందర్ రెడ్డి విజయం సాధించారు.












Click it and Unblock the Notifications