రేవంత్ రెడ్డికి ఫోన్ పే- పోస్టర్లు: కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల వేళ..
హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly elections 2023) వేడి పతాక స్థాయికి చేరుకుంటోంది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణ వ్యాప్తంగా నవంబర్ 30వ తేదీన ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల కమిషన్. డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్ ఉంటుంది.
వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి అధికార భారత్ రాష్ట్ర సమితి (Bharat Rashtra Samithi) కసరత్తు పూర్తి చేస్తోంది. ఎన్నికల ప్రచార కార్యక్రమాలపై దృష్టి సారించింది. షెడ్యూల్ విడుదల కావడానికి ఎంతో సమయం లేకపోవడం వల్ల అభివృద్ధి ప్రాజెక్టుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను ముమ్మరం చేసింది.

అటు కాంగ్రెస్ (Congress), భారతీయ జనతా పార్టీ (BJP) ఈ సమరానికి రెడీ అయ్యాయి. బీఆర్ఎస్ (BRS) నుంచి వలస వచ్చిన నాయకుల చేరికతో కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరిగింది. బస్సు యాత్రకు శ్రీకారం చుట్టబోతోంది. తెలంగాణ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించబోతోన్నారు ఆ పార్టీ నాయకులు.
దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తోన్నారు. దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లోనూ పర్యటించేలా రోడ్ మ్యాప్ను రూపొందించారు. దీనికి అవసరమైన షెడ్యూల్ కూడా ఇప్పటికే వెలువడింది. పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ సైతం బస్సు యాత్రలో పాల్గొనబోతోన్నారు.
ఇదే ఊపులో తాజాగా కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం తన అభ్యర్థుల తొలి జాబితా (Telangana Congress first list 2023)ను విడుదల చేసింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీనియర్ నేతలు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పీ సుదర్శన్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, గండ్ర సత్యనారాయణ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీలిమా రెడ్డి, సీతక్క, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. వంటి సీనియర్లు తొలి జాబితాలో ఉన్నారు.
ఈ పరిణామాల మధ్య రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముడుపులు తీసుకుని టికెట్లను కేటాయించారని ఆరోపిస్తూ పలుచోట్ల పోస్టర్లు వెలిశాయి. ఫోన్ పే డిజైన్లో పోస్టర్లను అతికించారు. వీటిని ఎవరు అతికించారనేది తెలియరావట్లేదు. తొలి జాబితా విడుదలైన కొద్దిసేపటికే- దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది.












Click it and Unblock the Notifications