తట్టుకోలేకపోతున్నా: కిష్టారెడ్డి మృతికి కంటతడి పెట్టిన గీతారెడ్డి
హైదరాబాద్: కాంగ్రెస్ శాసనసభ్యుడు పటోళ్ల కిష్టారెడ్డి మరణానికి సంతాపం వ్యక్తం చేస్తూ కాంగ్రెసు శాసనసభ్యురాలు జె. గీతా రెడ్డి బుధవారం తెలంగాణ శాసనసభలో కంటతడి పెట్టారు. కిష్టారెడ్డి మృతిని తట్టుకోలేకపోతున్నానని ఆమె అన్నారు. నారాయణఖేడ్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో అధికార పార్టీసహా ఇతర రాజకీయ పార్టీలు అభ్యర్ధులను నిలబెట్టరాదని, కిష్టారెడ్డి మీద గౌరవంతో కుటుంబీకుల్లో ఒకరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు సహకరించాలని కాంగ్రెస్ సభ్యులు కోరారు.
బుధవారం తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన వెంటనే ముందుగా భారత మాజీ రాష్టప్రతి అబ్దుల్ కలాం, నారాయణఖేడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పటోళ్ల కిష్టారెడ్డి మృతికి సభ్యులు నివాళి అర్పించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా తనకు కిష్టారెడ్డి నాలుగు దశాబ్ధాలుగా పరిచయం ఉందని చెప్పారని ఆమె గుర్తు చేశారు. తాను అసెంబ్లీ వేదికగా అన్ని రాజకీయ పార్టీలను కోరుతున్నానని, ఈ స్థానాన్ని ఏకగ్రీవం చేయాలన్నారు. అన్ని పార్టీలు ఈ ప్రతిపాదనను బలపర్చాలన్నారు.
నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఎనలేని సేవలు అందించిన కిష్టారెడ్డి మృతివల్ల ఖాళీ అయిన నారాయణఖేడ్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఏకగ్రీవం చేయాలని మరో కాంగ్రెసు సభ్యుడు జి. చిన్నారెడ్డి అన్నారు. పిఏసి చైర్మన్గా రెండుసార్లు పని చేశారన్నారు. మంత్రి కావాలనే కిష్ణారెడ్డి ఆకాంక్ష నెరవేరలేదన్నారు.

అన్ని పార్టీలు కిష్టారెడ్డి ఎన్నికైన స్థానం ఏకగ్రీవం అయ్యేలా చూడాలని కాంగ్రెసు శాసనసభ్యుడు జీవన్ రెడ్డి అన్నారు. కిష్టారెడ్డి కుటుంబంతో ఉన్న సంబంధాలను ప్రస్తావించారు. నాలుగు దశాబ్ధాలుగా కిష్టారెడ్డితో ఉన్న స్నేహాన్ని, కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ ప్రాంతానికి చేసిన సేవలను సిఎల్పీ నేత కె. జానా రెడ్డి కొనియాడారు.
మంత్రి హరీశ్రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, బిజెపి శాసనసభాపక్ష నేత లక్ష్మణ్, తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకరరావు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డికె అరుణ, సంపత్కుమార్, సిపిఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, సిపిఐ ఎమ్మెల్యే రవీందర్నాయక్ కిష్టారెడ్డి చేసిన సేవలను కొనియాడుతూ నివాళి అర్పించారు. కిష్టారెడ్డి జీవిత విశేషాలను స్పీకర్ మదుసూధనాచారి చదివారు. అనంతరం రెండు నిమిషాలపాటు సభ వౌనం పాటించింది.












Click it and Unblock the Notifications