రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పగ్గాల అప్పగింతపై తేల్చేసిన తెలంగాణ కాంగ్రెస్..!!
హైదరాబాద్: అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో పార్టీ అధ్యక్ష ఎన్నిక కోలాహలం నడుస్తోంది. అక్టోబర్ 17వ తేదీన కాంగ్రెస్ నాయకులు తమ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకొనబోతోన్నారు. ఈ నెల 24వ తేదీ నుంచి దీనికి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ఆరంభం కానుంది. 30వ తేదీన నామినేషన్లను దాఖలు గడువు ముగుస్తుంది. ఏఐసీసీ అధ్యక్ష పదవిలో గాంధీయేతర కుటుంబానికి చెందిన నాయకుడు ఎన్నిక కావడం దాదాపుగా ఖాయమైంది.
మమత బెనర్జీని ఏం చేశారు..ఆ రహస్యం ఏంటి?: ఉప రాష్ట్రపతిని నిలదీసిన సీఎం
పార్టీ ఓటమికి..
ప్రస్తుతం సోనియా గాంధీ ఏఐసీసీ తాత్కాలిక అధ్యక్షురాలిగా వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే. రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించడానికి ఏ మాత్రం ఇష్టపడట్లేదు. 2019 నాటి సార్వత్రిక ఎన్నికలను కాంగ్రెస్.. ఆయన సారథ్యంలోనే ఎదుర్కొంది. పరాజయం పాలైంది. పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ పదవి నుంచి తప్పుకొన్నారు. తనకు ఎలాంటి పదవులు వద్దని, ఓ సాధారణ నాయకుడిగా కొనసాగుతానని స్పష్టం చేశారు.
శశిథరూర్ లేదా గెహ్లాట్
ఆరోగ్య కారణాల వల్ల అటు సోనియా గాంధీ కూడా పూర్తిస్థాయిలో ఏఐసీసీ సారధ్య బాధ్యతలను తీసుకోవడానికి ముందుకు రావట్లేదు. దీనితో గాంధీయేతర కుటుంబానికి చెందిన నాయకుడి చేతుల్లో కాంగ్రెస్ వెళ్లడం ఖాయమైంది. ప్రస్తుతం కేరళకు చెందిన సీనియర్ నాయకుడు, తిరువనంతపురం లోక్సభ సభ్యుడు శశిథరూర్, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పేర్లు విస్తృతంగా వినిపిస్తోన్నాయి. వారిద్దరూ ఏఐసీసీ అధ్యక్ష పదవికి పోటీ పడనున్నారు.
రాహుల్ గాంధీ వైపే..
ఈ పరిణామాల మధ్య పలు రాష్ట్రాలు- ఏఐసీసీ పగ్గాలను రాహుల్ గాంధీ చేతికే అప్పగించాలంటూ డిమాండ్ చేస్తోన్నాయి. ఈ మేరకు తీర్మానాలు కూడా చేసి అధిష్ఠానానికి పంపిస్తోన్నాయి. ఏపీ సహా రాజస్థాన్, ఛత్తీస్గఢ్, బిహార్, తమిళనాడు, జార్ఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర ఇప్పటికే ఈ తీర్మానాలను పంపించాయి. అదే జాబితాలో తాజాగా ఇప్పుడు తాజాగా తెలంగాణ కూడా చేరింది. ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీని ఏకగ్రీవంగా నియమించాలని కోరుతూ తీర్మానించింది.
తెలంగాణ కూడా..
ఈ మేరకు హైదరాబాద్ గాంధీభవన్లో నిర్వహించిన ప్రతినిధుల సమావేశంలో ఈ తీర్మానాన్ని ఆమోదించారు పీసీసీ నాయకులు. భారత్ జోడో యాత్రతో దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీకి మంచి పేరు వస్తోందని, ఈ పరిస్థితుల్లో ఆయనే పార్టీకి అధ్యక్షుడిగా నియమితులు కావడం సత్ఫలితాలను ఇస్తుందని అభిప్రాయపడ్డారు. మొత్తంగా రెండు తీర్మానాలను ఆమోదించారు. పీసీసీ చీఫ్, కార్యనిర్వాహక కమిటీ, ఏఐసీసీ సభ్యులను నామినేట్ చేసే అధికారం సోనియాగాంధీకి అప్పగిస్తూ ఓ తీర్మానం.. రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతలు తీసుకోవాలని కోరుతూ మరో తీర్మానాన్ని ఆమోదించారు.