కత్తిపోట్లతో రక్తమోడుతున్నా ఉగ్రవాదిని వదల్లేదు: శ్రీనివాసులుకు శౌర్యచక్ర
అసామాన్య ధైర్యసహాసాలు చూపిన తెలంగాణ రాష్ట్ర కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం హెడ్కానిస్టేబుల్ కుక్కడపు శ్రీనివాసులు.. ప్రతిష్ఠాత్మకశౌర్యచక్ర పురస్కారాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అందుకున్నార
న్యూఢిల్లీ/హైదరాబాద్: అసామాన్య ధైర్యసహాసాలు చూపిన తెలంగాణ రాష్ట్ర కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం హెడ్కానిస్టేబుల్ కుక్కడపు శ్రీనివాసులు.. ప్రతిష్ఠాత్మకశౌర్యచక్ర పురస్కారాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అందుకున్నారు. ఉగ్రవాది కత్తితో కడుపులో పొడవడంతో పొట్టలోంచి పేగులు బయటకొచ్చి తీవ్ర రక్తస్రావం అవుతున్నా.. లెక్కచేయకుండా ఆ ఉగ్రవాదిని వెంబడించి పట్టుకున్నారు శ్రీనివాసులు.
ఆ పోలీసుకు శౌర్యచక్ర: కత్తిపోట్లతో రక్తమోడుతున్నా ఉగ్రవాదిని వదల్లేదు
ఢిల్లీలోని రాష్ట్రపతిభవన్లో గురువారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ పురస్కారాన్ని శ్రీనివాసులుకు అందజేశారు. నల్గొండ జిల్లాకు చెందిన శ్రీనివాసులు 1998లో కానిస్టేబుల్గా పోలీసుశాఖలో చేరారు. గ్రేహౌండ్స్లో, హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని టాస్క్ఫోర్స్లో పనిచేశారు. కొన్నేళ్లుగా కౌంటర్ ఇంటెలిజెన్స్ (సీఐ) విభాగంలో పనిచేస్తున్నారు.
కాగా, ఇస్లామిక్స్టేట్ ఉగ్రవాదసంస్థ సానుభూతిపరులైన కొందరు ఉగ్రవాదులు హైదరాబాద్తోపాటు దేశవ్యాప్తంగా పేలుళ్లకు కుట్ర పన్నటంతో వారిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) గతేడాది జనవరిలో అరెస్టు చేసింది. ఈ నేపథ్యంలో ఆ ఉగ్రవాదుల ముఠా కార్యకలాపాలపై సీఐ సెల్ దృష్టి పెట్టింది. అరెస్టయిన ఉగ్రవాదులకు గుజరాత్కు చెందిన ఆలం జబ్ అఫ్రీద్ శిక్షణ ఇచ్చినట్టు గుర్తించింది.
అప్పటికే అఫ్రీద్పై దేశవ్యాప్తంగా దాదాపు 25 పేలుళ్లు, కుట్ర, విద్రోహచర్యలకు పాల్పడిన కేసులు నమోదై ఉన్నాయి. అతడు 2008 నుంచి పరారీలో ఉన్నాడు. అఫ్రీద్ కోసం గాలింపు జరిపిన సీఐ సెల్ అధికారులు... కర్ణాటకలోని పరప్పణ అగ్రహార పోలీసు స్టేషన్ పరిధిలోని దొడ్డినాగమంగళం ప్రాంతంలో మెకానిక్ పనులు చేస్తూ నివసిస్తున్నాడని కనుగొన్నారు. అతడ్ని పట్టుకునేందుకు గత సంవత్సరం జనవరి 23న కానిస్టేబుల్ శ్రీనివాసులుతోపాటు మరో ముగ్గురితో కూడిన బృందాన్ని పంపించారు.
వారిని గమనించిన అఫ్రీద్ బైక్పై పారిపోయేందుకు ప్రయత్నించటంతో అతడిని శ్రీనివాసులు వెంబడించారు. దీంతో అఫ్రీద్ కత్తితో శ్రీనివాసులు పొత్తికడుపులో బలంగా పొడిచాడు. దీంతో పేగులు బయటకు వచ్చి, కడుపులోనుంచి రక్తస్రావం అవుతున్నప్పటికీ శ్రీనివాసులు వెనక్కితగ్గలేదు. అక్కడ లభించిన ఓ టవల్తో పొట్టకు కట్టు కట్టుకొని, వేగంగా పరుగెత్తి అఫ్రీద్ను పట్టుకున్నారు.
అఫ్రీద్ చేతికి బేడీలు పడిన తర్వాతే చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లారు కానిస్టేబుల్ శ్రీనివాసులు. 20 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. శ్రీనివాసులుకు శౌర్యచక్ర పురస్కారాన్ని, ఆయనతోపాటు ఉన్న మరో ముగ్గురు సీఐ సెల్ కానిస్టేబుళ్లకు శౌర్య పతకాలను గత ఆగస్టులోనే ప్రకటించడం జరిగింది. ఈ క్రమంలో శ్రీనివాసులు ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా శౌర్యచక్ర పురస్కారాన్ని గురువారం అందుకున్నారు. మిగతా ముగ్గురు కానిస్టేబుళ్లు ఈ ఏడాది ఆగస్టులో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా శౌర్య పతకాలను అందుకోనున్నారు.
ఇది ఇలా ఉండగా, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాదులపై లక్షితదాడులు జరిపిన బృందసభ్యులైన మేజర్ రజత్చంద్ర, కెప్టెన్ అశుతోష్కుమార్, మేజర్ దీపక్ ఉపాధ్యాయ్, అబ్దుల్ ఖయ్యూంలకు కూడా రాష్ట్రపతి గురువారం శౌర్యచక్రను అందజేశారు. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ఇద్దరు పోలీసు అధికారులతోపాటు మొత్తం 12 మందికి శౌర్యచక్ర లభించింది. లక్షితదాడుల్లో పాల్గొన్న మరో 19 మంది జవాన్లకు గ్యాలెంట్రీ మెడల్స్ లభించాయి. కాగా, ఉగ్రవాదుల, అసాంఘిక శక్తుల చేతిలో ప్రాణాలొదిలిన భద్రతా అధికారుల తరపున పతకాలను అందుకుంటూ వారి కుటుంబసభ్యులు భావోద్వేగానికి గురయ్యారు.