సోమవారం సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణలో లోక్ సభ స్థానాలకు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉపఎన్నికకు సంబంధించి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మే 13వ తేదీన రాష్ట్రంలో పోలింగ్ జరగనుంది. జూన్ నాలుగోతేదీన ఫలితాలు విడుదలవుతాయి. వివిధ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలు కల్పించారు. ఆరోజును వేతనంతో కూడి సెలవుగా తెలంగాణ కార్మిక శాఖ ప్రకటించింది. తెలంగాణ కర్మాగారాలు, దుకాణాలు, ప్రజాప్రాతినిధ్య చట్టం, సముదాయాల చట్టాల కింద సెలవు ప్రకటిస్తూ కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కౌముదిని ఉత్తర్వులు జారీ చేశారు.
వచ్చేనెల 18వ తేదీన నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. నామినేషన్లు దాఖలు చేసేందుకు చివరితేదీ 25. 26వ తేదీన నామినేషన్ల పరిశీలనకాగా, ఉపసంహరణకు 29వ తేదీ చివరితేదీగా ప్రకటించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకటించారు. ఎన్నికలను సక్రమంగా నిర్వహించేందుకు అన్నిచర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. లక్షా 80వేల మంది సిబ్బందిని ఎన్నికల కోసం ఉపయోగించనున్నట్లు వికాస్ రాజ్ తెలిపారు.

ఎన్నికల కోసం రాష్ట్రవ్యాప్తంగా 90వేల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత 8,58,491 ఓట్లను తొలగించారు. కొత్తగా 8 లక్షల ఓటర్లు వచ్చారు. మొత్తం 17 నియోజకవర్గాల్లో మెజారిటీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంటుందంటూ ఇప్పటికే పలు సర్వేలు స్పష్టం చేస్తున్నారు. మొన్నటివరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కు అతి కష్టంమీద ఎంపీ అభ్యర్థులు దొరికారు. బీజేపీ గత ఎన్నికల్లో నాలుగు ఎంపీ స్థానాలను దక్కించుకోగా ఈసారి వాటి సంఖ్యను రెట్టింపు చేయాలనే పట్టుదలతో ఆ పార్టీ ఉంది.












Click it and Unblock the Notifications