రేవంత్ వ్యాఖ్యలు శాంతిభద్రతలకు ప్రమాదం: కౌంటర్ ఇచ్చిన తెలంగాణ డీజీపీ కార్యాలయం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ, డీజీపీపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై రాష్ట్ర డీజీపీ కార్యాలయం స్పందించింది. ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టింది. అవన్నీ నిరాధార ఆరోపణలని మండిపడింది. ఈ మేరకు డీజీపీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
డీజీపీ, మంత్రుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని, ఉన్నతాధికారుల మధ్య విభేదాలు ఉన్నాయనేది అవాస్తవమని స్పష్టం చేసింది. అన్ని విభాగాల మధ్య మంచి సమన్వయం ఉంది. ప్రతిభ, సామర్థ్యం ఆధారంగానే పోలీసు శాఖలో పోస్టింగులు ఇచ్చామని పేర్కొంది. నిరాధార ఆరోపణల వల్ల పోలీసుల ఆత్మస్థైర్యం, మనోధైర్యం దెబ్బతింటుందని తెలిపింది.
మావోయిస్టులు ఉంటే బాగుండేదని రేవంత్ అనడం సరికాదని డీజీపీ కార్యాలయం ఆ ప్రకటనలో పేర్కొంది. ప్రజాప్రతినిధులను కూడా మావోయిస్టులు బలితీసుకున్నారు. మావోయిస్టుల ఏరివేతలో 350 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు పరువు నష్టం కలిగించేవిగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది.
రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సమాజంలో శాంతిభద్రతలపై తీవ్ర ప్రభావం చూపించే ప్రమాదం ఉంది. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారమే పోలీసు శాఖ నడుచుకుంటోందని తెలిపింది. శాంతిభద్రతల పరిరక్షణ కోసం రాజ్యాంగబద్ధంగా అధికారులు విధులు నిర్వహిస్తున్నారని డీజీపీ కార్యాలయం స్పష్టం చేసింది.
అసలు రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..?
పోలీస్ శాఖలో స్పిట్ వచ్చిందని, పోలీసు శాఖ రెండుగా చీలిపోయిందని.. రాష్ట్ర డీజీపీ ఫోన్ కూడా ట్యాప్ అవుతోందని ఆదివారం హుజూరాబాద్ లో ఉపఎన్నిక ప్రచారం నిర్వహించిన సమయంలో రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రభాకర్ రావుకి ప్రభుత్వం అప్పగించిన రెండు పనుల్లో రేవంత్, డీజీపీ ఫోన్ ట్యాప్ చేయడమే పని అని రేవంత్ ఆరోపించారు. రిటైర్డ్ అయిన డీఎస్పీ వేణుగోపాల్ రావు వద్ద 32 మందితో నిఘా పెట్టారని, డీజీపీ మీద నర్సింగ్ రావుని నిఘా పెట్టారని అన్నారు. డీజీపీ కూడా భయం భయంగా బతుకుతున్నారన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఇలాంటి నిఘా లేదని రేవంత్ వ్యాఖ్యానించారు. రిటైర్డ్ అయిన కొందర్ని స్వంతంగా పెట్టి వ్యవస్థలను నడిపిస్తున్నారని అన్నారు. సిటీ చుట్టూ ముట్టు తన వారికే పోస్టింగులు వేశారని, పోలీసు శాఖలో రెండు సామాజిక వర్గాల మధ్య ఉద్రిక్తత వాతావరణం ఉందన్నారు. ఏపీకి చెందిన కేసీఆర్ బంధువును డిప్యూటేషన్ మీద తెప్పించడం అవసరమా? అని రేవంత్ ప్రశ్నించారు.