నయీం కుడి భజం శేషన్న అరెస్టుకు డిజిపి: ఆదేశం ఎస్బిఐ వేట ఇలా..
హైదరాబాద్: గ్యాంగ్స్టర్ నయీం కుడిభుజం శేషన్న, అతని గ్యాంగ్ కోసం తెలంగాణలోని ఎస్ఐబీ పోలీసుల వేట సాగుతున్నది. వీలైనంత త్వరగా కరడుగట్టిన ఈ నేరస్తుడిని పట్టుకోవాలనే లక్ష్యంతో నిఘా విభాగంతోపాటు వివిధ జిల్లాల పోలీసులు సమన్వయంతో పని చేసేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారని సమాచారం.
2014కి ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతోపాటు సరిహద్దు రాష్ట్రాల్లో నేర సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని దాదాపుగా సమాంతర ప్రభుత్వాన్ని నడిపించిన నయీం ఎలియాస్ నయీముద్దీన్ 2016 ఆగస్టు 8వ తేదీన షాద్నగర్లో ఎన్కౌంటరైన సంగతి తెలిసిందే.
ఈ ఘటన చోటు చేసుకున్నాక మరో నయీం కుడిభుజంగా పేరొందిన శేషన్న తన 30 మంది అనుచరులతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. నాటి నుంచి తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు శేషన్న అరెస్టు కోసం అన్వేషణ సాగిస్తున్నాయి
నయీం స్థాయిలో నేరమయ వ్యవహారాలు నడిపే సామర్థ్యం శేషన్నది
నయీం ఎంతటి కరడుగట్టిన నేరస్తుడో దాదాపు అదే స్థాయిలో వ్యవహారాలు నడిపించే శేషన్న జాడ పోలీసులకు సవాల్గా మారింది. నయీం ఎన్కౌంటర్ జరిగి 17 నెలలు దాటింది. కానీ శేషన్నను ఈ కేసు దర్యాప్తు జరుపుతున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) కానీ , ఇటు హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పోలీసులు కానీ పట్టుకోవడంలో విఫలమయ్యారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.
నయీం బాదితులను వెంటాడుతున్న శేషన్న భయం
మరో వైపు గ్యాంగ్స్టర్ చనిపోవడంతో నయీం బాధితులు ఎంతగా కుదుట పడ్డారో, అతని కుడిభుజం ఇంకా పట్టుబడక పోవడం పట్ల తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే జైలులో ఉన్న నయీం మరో అనుచరుడు పాశం శ్రీను లోపలి నుంచే సెటిల్మెంట్లను నడిపించడం, నేరుగా ఫోన్లో మాట్లాడుతూ తమన మాట వినని వారికి వార్నింగ్లు ఇవ్వడం వంటి చర్యలు చోటు చేసుకున్నాయి.
నయీం గ్యాంగ్ బయట ఉన్నా కొనసాగుతున్న ఆగడాలు
దీంతో ఇటు జైలులో ఉన్న నయీం గ్యాంగ్ ఆగడాలు బయట సాగుతుండటం, ఇంకా శేషన్న కటకటాల వెనక్కి చేరక పోవడంతో బాధితులు కోర్టులో సాక్ష్యం చెప్పడానికి కూడా వెనుకంజ వేసే ప్రమాదం ఉంది. శేషన్నను పట్టుకోవడానకి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నామని పోలీసు ఉన్నతాధికారులు చెప్తుండగా, చోటా గ్యాంగ్స్టర్ హైదరాబాద్ నగర శివార్లలో కొందరి శుభకార్యాలకు హాజరయ్యాడని వార్తలు వచ్చాయి.
శేషన్న అరెస్టయ్యే వరకూ కేసు అసంపూర్ణమే?
ఈ నేపథ్యంలో నయీంనకు చెందిన దాదాపు 126 మంది గ్యాంగ్ సభ్యులు, ఇతర అనుచరులను సిట్ అరెస్టు చేసినా శేషన్న దొరికే వరకు ఈ కేసు దర్యాప్తు కూడా పూర్తి కానట్లేనని బాధితులు అభిప్రాయ పడుతున్నారు ఈ నేపథ్యంలో డీజీపీగా బాధ్యతలు చేపట్టిన మహేందర్రెడ్డి త్వరలోనే శేషన్నను పట్టుకుంటామని చేసిన ప్రకటనతో బాధితులకు కొంత స్వాంతన చేకూరినట్టు తెలుస్తోంది.
శేషన్న అరెస్ట్ కోసం ఎస్ఐబీకి స్పెషల్ అసైన్మెంట్
శేషన్నను పట్టుకోవడానికి యాంటీ నక్సలైట్ నిఘా విభాగం ఎస్ఐబీకి ప్రత్యేకించి అసైన్మెంట్ను కూడా అప్పగించారని వినికిడి. దీంతో రంగంలోకి దిగిన వేగులు శేషన్న కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారని తెలిసింది. ఇందుకు అన్ని జిల్లాల్లోని తమ ఇన్ఫార్మర్లను అలర్ట్ చేసిన అధికారులు మరో పక్క పక్క రాష్ట్రాల నిఘా విభాగాల సహకారం పొందుతున్నారని తెలిసింది.
నిఘా, మాజీ అధికారులతో అన్వేషణ మొదలు
మాజీ నక్సలైట్ శేషన్న కదలికలు, ఎత్తుగడల గురించి బాగా తెలిసిన నిఘా అధికారులతో పాటు పదవీ విరమణ చేసిన మరి కొందరు అధికారులను కూడా ఈ వేటలో భాగం చేశారని తెలిసింది. ఎప్పుడు శేషన్న పట్టుబడతాడోనని బాధితులు ఎదురు చేస్తున్నారు.