తెలంగాణా ఎన్నికల పోలింగ్: తెలుగులో ప్రధాని మోడీ ఆసక్తికర ట్వీట్!!
తెలంగాణా రాష్ట్రంలో ఎన్నికల పండుగ కొనసాగుతుంది. ఓటర్లు ఇప్పుడిప్పుడే పోలింగ్ కేంద్రాలకు వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా 119అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎన్నికల పోలింగ్ లో 2,290మంది అభ్యర్థుల రాజకీయ భవితవ్యాన్ని ఓటర్లు తమ ఓటు హక్కు ద్వారా తేల్చనున్నారు.
ఇక ఈ రోజు ఎన్నికలపోలింగ్ నేపధ్యంలో అన్ని రాజకీయ పార్టీలకు టెన్షన్ నెలకొంది. ఓటరు దేవుళ్ళ తీర్పు ఏ పార్టీకి అనుకూలంగా ఉంటుంది అన్నది అందరిలోనూ ఆందోళనకు కారణంగా మారింది. ఇదిలా ఉంటే ఎన్నికల పండుగ నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు చోటు చేసుకోకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఓటింగ్ చేసేలా ప్రజలను ఆకట్టుకునేందుకు మోడల్ పోలింగ్ స్టేషన్లను బాగా అందంగా అలంకరించి మరీ ఏర్పాటు చేశారు.

కట్టుదిట్టమైన భద్రత నడుమ ప్రస్తుతం పోలింగ్ కొనసాగుతుంది. అయితే అధికారులు, ప్రభుత్వాలు ఈసారి ఎన్నికలలో ఓటింగ్ పెంచాలని శత విధాలా ప్రయత్నం చేశాయి. ఎన్నికల సంఘం స్వీప్ ద్వారా ఓటరు అవగాహనా కార్యక్రమాలు పెట్టి మరీ ఓటుహక్కు ప్రాధాన్యతను స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఈసారి అత్యధికంగా పోలింగ్ శాతం నమోదు అవుతుందని అంతా భావిస్తున్నారు.

ఇక పోలింగ్ కొనసాగుతున్న క్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణా ఓటర్లను ఉద్దేశించి ట్వీట్ చేశారు. ఆయన తన ట్వీట్ ను తెలుగులోనే చెయ్యటం గమనార్హం. ఈ ట్వీట్ ద్వారా అయన ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలపై ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ రోజు తెలంగాణలోని నా సోదర సోదరీమణులు రికార్డు స్థాయిలో ఓటు వేసి ప్రజాస్వామ్య పండుగను బలోపేతం చేయాలని నేను పిలుపునిస్తున్నానని మోడీ ట్వీట్ లో పేర్కొన్నారు.
యువకులు మరీ ముఖ్యంగా మొదటిసారిగా ఓటు వేస్తున్నవారు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని నేను ప్రత్యేకంగా కోరుతున్నానని పీఎం మోడీ తెలిపారు. ఓటు వేస్తేనే ప్రజాస్వామ్యం ఫరిడవిల్లుతుందని, సరైన నాయకుల ద్వారానే సమర్ధ పాలన జరుగుతుందని ప్రధాని మోడీ తన ట్వీట్ ద్వారా తెలియజేశారు.












Click it and Unblock the Notifications