ధరణి పోర్టల్తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు భూములు: నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ
తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. తాజాగా ఆయన నిజామాబాద్ జిల్లా బోధన్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన రాహుల్ గాంధీ తెలంగాణ సీఎం కేసీఆర్ పైన, కెసిఆర్ సర్కార్ తీరు పైన, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో దొరల పాలన కొనసాగుతోందని, కాళేశ్వరం పేరుతో పెద్ద కుంభకోణం చేశారని మండిపడ్డారు. ధరణి పోర్టల్ తో.. ఎం.ఎల్. ఏ లకు భూములు అప్పగిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కేసీఆర్, కేంద్రంలో మోడీ ఇద్దరూ ఒకటేనని ఆయన టార్గెట్ చేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వానికి కేసీఆర్ అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నారని ఆరోపించారు.

రాష్ట్రం లో కేసీఆర్ కారు పంక్చర్ అయ్యిందని పేర్కొని తెలంగాణలో అధికారంలోకి కాంగ్రెస్ వస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. బిజెపి ప్రభుత్వం నరేంద్రమోడీ నల్లచట్టాలు చేసి రైతులను మోసం చేస్తున్నారని, తన పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేశారని, తనకు ప్రభుత్వం ఇచ్చిన క్వార్టర్స్ ను కూడా లాక్కున్నారని ఆయన మండిపడ్డారు. తనకు బీజేపీ సర్కార్ ఇళ్ళు అవసరం లేదని, దేశంలోని ప్రజల ఇల్లు తనవని ఆయన అన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని రాహుల్ గాంధీ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో దొరలకు, ప్రజలకు మధ్య యుద్ధం జరుగుతుందని, ఈ యుద్ధంలో ప్రజలే గెలవాలని రాహుల్ గాంధీ ఆశాభావం వ్యక్తం చేశారు. పేదల కోసం పోరాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణా తన సొంత ఇల్లన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ లను తరిమికొట్టాలన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఏ అభివృద్ధి చేసిందని కేసీఆర్ ప్రశ్నిస్తున్నారని పేర్కొన్న ఆయన తెలంగాణలో సీఎం కేసీఆర్ చదువుకుంది కూడా తాము కట్టించిన పాఠశాల భవనంలో నే అని తేల్చి చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తాము ఇచ్చిన ఆరు గ్యారెంటీ లను అమలు చేస్తామని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications