ఈటల జమున హేచరీస్కు మరో షాక్: చెట్లను నరికినందుకు అటవీశాఖ నోటీసులు
హైదరాబాద్: తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్కు మరో షాకిచ్చింది ప్రభుత్వం. ఇప్పటికే అసైన్డ్ భూముల వ్యవహారంలో మంత్రి పదవి నుంచి ఈటెల రాజేందర్ను తప్పించిన విషయం తెలిసిందే. తాజాగా, మరో వ్యవహారం ఆయనకు నోటీసులు జారీ అయ్యాయి.
ఈటల రాజేందర్ కుటుంబసభ్యుల పేరిట ఉన్న జమున హేచరీస్కు అటవీశాఖ ఇప్పుడు నోటీసులు పంపింది. జమున హేచరీస్కు రోడ్డు వేసేందుకు చెట్లను నరికారని అందులో పేర్కొంది. అనుమతి లేకుండా సుమారు 237 చెట్లను నరికారని నిర్ధారించింది. ఈ వ్యవహారంలో సమాధానం చెప్పాలని నోటీసులో పేర్కొంది.
ఇందుకు సంబంధించి మూడు రోజుల్లోగా సరైన సమాధానం రకపోతే వాల్టా చట్టం కింద కేసులు పెడతామని నోటీసులు స్పష్టం చేసింది. ఈటల రాజేందర్ భూకబ్జా ఆరోపణలపై విచారుణ జరుపుతున్న అటవీశాఖ ఇప్పుడు చెట్లను నరికారని నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.
కాగా, వాల్టా చట్టం ప్రకారం నరికిన చెట్లకు రెట్టింపు చెట్లను నాటడంతోపాటు నరికిన చెట్లకు విలువను కట్టి ఇవ్వాల్సి ఉంటుంది. మరోవైపు జమున హేచరీస్ అటవీశాఖకు సంబంధించిన భూములు కబ్జాకు గురిచేయలేదని అధికారులు తేల్చారు. ప్రస్తుతం చెట్లను నరికినిందుకు ఎలాంటి కేసులు పెట్టి ఎంత జిరిమానా వేస్తారో వేచిచూడాలి.
హకీంపేట, అచ్చంపేట అసైన్డ్ భూములు కబ్జా చేశారనే ఆరోపణలతో ఈటల రాజేందర్ తన మంత్రి పదవిని కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే, తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని, కబ్జాలు చేయలేదని రాజేందర్ చెప్పుకొచ్చారు. తనపై కుట్రలు జరిగాయన్నారు. రాజీనామా చేయమంటే తానే రాజీనామా చేసేవాడినని అన్నారు. ప్రస్తుతం ఆయన టీఆర్ఎస్ పార్టీలో కొనసగాలా? వద్దా? అనే యోచనలో ఉన్నారు. అంతేగాక, ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తారా? అనే చర్చ కొనసాగుతోంది.