తెలంగాణ కాంగ్రెస్లో బిగ్ వికెట్: మాజీ ఎమ్మెల్యే గుడ్బై: బీజేపీలో చేరిక: ఢిల్లీకి ప్రయాణం?
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్.. మరో బిగ్ ఫిష్ను చేజార్చుకోబోతోంది. పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పారు. త్వరలోనే ఆయన భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకోబోతోన్నారని తెలుస్తోంది. దీనికోసం దేశ రాజధానికి బయలుదేరి వెళ్తారని, బీజేపీ అధిష్ఠానం సమక్షంలో పార్టీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. ఇప్పటికే వలసల బెడదను ఎదుర్కొంటోన్న తెలంగాణ కాంగ్రెస్కు ఇది విఘాతంలా మారుతుందనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి.
పాదయాత్ర చేస్తోన్న సమయంలో..
తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడానికి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మల్కాజ్గిరి లోక్సభ సభ్యుడు పాదయాత్ర చేస్తోన్న వేళ.. ఓ సీనియర్ నేత రాజీనామా చేయడం కలకలం రేపుతోంది. కూన శ్రీశైలం గౌడ్ ప్రస్తుతం.. మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేస్తోన్నారు. కొంతకాలంగా ఆయన పార్టీలో క్రియాశీలకంగా ఉండట్లేదు. పీసీసీ నాయకత్వం, పార్టీ నేతల వ్యవహార శైలి పట్ల అసంతృప్తిగా ఉంటున్నారు. రేవంత్ రెడ్డి నిర్వహిస్తోన్న పాదయాత్ర పట్లా ఉపయోగం ఉండబోదంటూ ఆయన వ్యాఖ్యానించిన సందర్భాలు ఉన్నాయి.
కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా..
ఈ పరిణామాల మధ్య తాజాగా ఆయన తన డీసీసీ అధ్యక్ష పదవి, పార్టీకీ రాజీనామా చేశారు. ప్రత్యామ్నాయంగా బీజేపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోందని సమాచారం. ఉమ్మడి రాష్ట్రంలో 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన హైదరాబాద్ నగర శివార్లలోని కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, విజయం సాధించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సభ్యుడిగా కొనసాగారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు.
కాంగ్రెస్కు దూరంగా..
2014 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి, కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కేపీ వివేకానంద చేతిలో పరాజయం పాలయ్యారు. 2018 నాటి మధ్యంతర ఎన్నికల్లోనూ ఆయనను అదృష్టం వరించలేదు. తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి పోటీ చేసిన కేపీ వివేకానంద చేతిలోనే మరోసారి ఓడిపోయారు. అప్పటి నుంచి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. తన నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనలేదు. తాజాగా పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి పంపించారు.
జీహెచ్ఎంసీ ఫలితాలతో ప్రభావితం..
కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతోన్నందున ఆయన ఆ పార్టీలో చేరడానికే మొగ్గు చూపుతున్నారని అంటున్నారు. కాషాయ కండువాను కప్పుకోవడానికి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారని అంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సపల్ కార్పొరేషన్కు నిర్వహించిన ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా సాధించిన ఫలితాలు ఆయనను ప్రభావితం చేశాయని అంటున్నారు. మున్ముందు బీజేపీ మరింత బలపడే అవకాశం ఉన్నందున ఆ పార్టీలో చేరితే తన రాజకీయ భవిష్యత్తుకు ఢోకా ఉండదని ఆయన అభిప్రాయపడుతున్నట్లు చెబుతున్నారు.