మాస్టర్ ప్లాన్ ఎలా?: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్: కళాభారతి నిర్మాణం కోసం హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో పద్నాలుగు ఎకరాల స్థలాన్ని సాంస్కృతిక శాఖకు అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 73ని సవాలు చేస్తూ ఉమ్మడి హైకోర్టులో మరో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.
ఈ నిర్మాణాన్ని సవాలు చేస్తూ ఇప్పటికే దాఖలైన పిటిషన్పై విచారణ కొనసాగుతోంది. ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ కార్యదర్శి ఒఎం దేబరా తాజాగా దాఖలు చేసిన ఈ వ్యాజ్యంపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి భోసలే, జస్టిస్ ఎస్వి భట్లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది.
ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. ఎన్టీఆర్ స్టేడియం మాస్టర్ ప్లాన్కు సంబంధించిన విషయమై అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది.
కాగా, ఎన్టీఆర్ స్టేడియంలోని 14 ఎకరాల్లో కేవలం ఆరు ఎకరాల్లోనే కళాభారతి నిర్మిస్తామని మిగతా స్థలంలో పార్కింగ్, మొక్కల పెంపకం, వాకర్స్ పాత్ వే వంటివి ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం తరఫున అడ్వోకేట్ జనరల్ హైకోర్టుకు ఇటీవల తెలిపారు.
ఈ మైదానానికి సమీపంలోని వ్యాయామ కళాశాలకు పదెకరాల స్థలం ఉందని, భవన నిర్మాణం పోను మిగతా దాంట్లో స్థానిక పిల్లలు సాయంత్రం పూట, సెలవు దినాల్లో ఆడుకోవచ్చని తెలిపింది. ఈ విషయాలను పేర్కొంటూ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు.